పులివెందుల పూల అంగళ్ల ముందే జగన్ చిట్టా విప్పుతా: ఆదినారాయణ రెడ్డి
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తులు రూ.6 లక్షల కోట్లని, పులివెందుల పూల అంగళ్లముందే ఆయన చిట్టా విప్పుతానని కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగులో సోమవారంటీడీపీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్నాయుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జగన్పై విరుచుకుపడ్డారు. నాడు లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందని అన్నారు. జగన్కు చెక్పెట్టేందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు.
మాజీమంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానన్నారు. అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాననని, తనను ఇబ్బందిపెడితే తానూ ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడనన్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నందువల్లే టీడీపీలో చేరామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభకు గెలిచిన ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన సోదరుడు దేవగుడి నారాయణ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.