జమ్మలమడుగు నాదంటే నాది: మంత్రి ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి, బాబు హామీ, తలనొప్పే
కడప: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండగానే జమ్మలమడుగు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జమ్మలమడుగు స్థానం నుంచి తాను పోటీ చేస్తానంటే.. తాను పోటీ చేస్తానంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు.
అసెంబ్లీ సీటు నాదే..
శుక్రవారం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ తనదేనంటూ తేల్చి చెప్పారు. ఇక్కడ తానే ఎమ్మెల్యేగా, మంత్రిగా సీనియర్ నాయకుడినని వ్యాఖ్యానించారు.
Recommended Video
ఆదినారాయణ రెడ్డి ఎవరు?
కాగా, మే 2న రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. జిల్లాలో అసెంబ్లీ టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు హామీ ఇచ్చారు
అంతేగాక, జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణ రెడ్డి ఎలా ప్రకటిస్తారని రామసుబ్బారెడ్డి నిలదీశారు. ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలోనే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోలేదని తనకు హామి ఇచ్చారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హయాం నుంచే టీడీపీ టికెట్లు ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదని అన్నారు.
వర్గపోరు.. టీడీపీ అధిష్టానానికి తలనొప్పే..
కొందరు పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారని మంద్రి ఆదిని ఉద్దేశించి అన్నారు. లేనిపోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గ పోరు పెంచుతున్నారని దుయ్యబట్టారు. జమ్మలమడుగు టికెట్ కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలోనని ఇప్పట్నుంచే టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయానికి ఈ అంశం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు.