వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐకి అప్పగించాలి.. ఆదినారాయణరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఒక్కొ అనుమానితుడిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ కుటుంబసభ్యులు, పనివాళ్లు, డ్రైవర్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా ఎంక్వైరీ చేశారు. అయితే మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి మాత్రం సిట్ కాకుండా సీబీఐ చేత విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లో వాదోప వాదనలు కొనసాగుతున్నాయి.
సీబీఐకి బదిలీ..
వివేకానంద హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం కూడా వాదనలు జరిగాయి. సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరిపిస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని ఆది నారాయణ రెడ్డి తరఫు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. గత 9 నెలల నుంచి సిట్ దర్యాప్తు చేస్తోందని.. విచారణ తుది దశకొచ్చిందని తెలిపారు. మరికొద్దిరోజుల్లో విచారణ పూర్తవుతోందని, ఈ సమయంలో కేసును సీబీఐకి అప్పగించడం సరికాదని సూచించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేసింది.
సిట్పై నమ్మకం లేదు
సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆది నారాయణ రెడ్డి ఇదివరకే స్పష్టంచేశారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానని సవాల్ కూడా విసిరారు. వివేకానంద హత్య కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి పిటిషన్పై హైకోర్టు తీర్పు ఏం చెబుతుందో చూడాలి.
9 నెలలుగా విచారణ
గత 9 నెలల నుంచి వివేకానంద హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఇప్పటివరకు 1300 మంది పైచిలుకు అనుమానితులను ప్రశ్నించింది. కొందరినీ పుణె తీసుకెళ్లి నార్కొ అనాలిసిస్ టెస్టులు కూడా నిర్వహించింది. తర్వాత అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విడతలవారీగా విచారిస్తోంది.
ప్రశ్నించింది వీరినే..
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కూడా ప్రశ్నించింది. వీరితోపాటు వైఎస్ మనోహర్ రెడ్డి, టీడీపీ నేత కోరటి ప్రభాకర్ రెడ్డిని సిట్ అధికారులు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా మిగతావారికి నోటీసులు జారీచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేశారు. భాస్కర్ రెడ్డి, పనిమనిషిని కూడా ప్రశ్నించారు.