కెసిఆర్ హైదరాబాద్ ప్లాన్: ఇస్తాంబుల్ మోడల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఇస్తాంబుల్ మోడల్ను అనుసరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. నగర వీధుల్లో ట్రాఫిక్ సమస్యను తొలగించడానికి నగరంలోనూ, పరిసరాల్లోనూ స్కైవేలు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించాలని సూచించారు. మొదటి దశలో నగరంలోని రద్దీ ప్రాంతాల్లో 2 వేల కిలో మీటర్ల మేర వీటిని చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. నగరంలో రోడ్ల అభివృద్ధికి 25 నుంచి 30 వేల కోట్లను వ్యయం చేయనున్నట్లు తెలిపారు.
రానున్న 30-40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అలాగే హైదరాబాద్కు ఉత్తరాన మరో విమానాశ్రయ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి శనివారం తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, ఎల్ఈఏ అసోసియేట్స్ ప్రతినిధులు డాక్టర్ ఎం.ఫణిరాజు, కెనడాకు చెందిన రవాణా వ్యవస్థ, రహదారుల ప్రణాళికా నిపుణుడు జాన్ ఫెర్టో, టీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ఏటా 10 ల క్షల జనాభా పెరుగుతున్నదని, వివిధ అవసరాలపై నగరానికి రోజూ 15 లక్షల మంది వస్తుంటారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలను రూపొందించడం సర్వసాధారణమని చెప్పారు. రోడ్ల కోసం భవనాలను కూల్చడం సాధ్యం కాదు కాబట్టి ఇస్తాంబుల్ తరహాలో చారిత్రాత్మక కట్టడాలకు ఇబ్బంది కాకుండా, రహదారుల్ని నిర్మించాల్సి ఉంటుందన్నారు.
ఎల్బీనగర్ - మియాపూర్, ఉప్పల్-హైటెక్ సిటీ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉన్నందున హైవేలను నిర్మించాలని, పాతబస్తీ రోడ్లను ఆధ్యయనం చేసి వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. రద్దీ బాగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఆకాశవీధుల(స్కైవే) నిర్మాణం చేపట్టాలని సూచించారు. భూ ఉపరితలం మీద ఉన్నట్టే ఈ ఫ్లైఓవర్లను అనుసంధానం చేస్తూ జంక్షన్లు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధి రోడ్లను అభివృద్ధి చేయాలని, తర్వాత హెచ్ఎండీఏ పరిధిలోని రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పదే పదే తవ్వే పరిస్థితి లేకుండా రోడ్డు నిర్మాణ సమయంలోనే భూగర్భ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పుడున్న ఔటర్రింగ్రోడ్డుకు అవతల రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టాలని ముఖ్యమయంత్రి చెప్పారు. సంగారెడ్డి, వికారాబాద్, షాబాద్, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్ మీదుగా ఈ రోడ్డు ఉండాలని అన్నారు.