వైఎస్ జగన్ సర్కార్ లో నిరసనల పర్వం: అటు రాయలసీమ..ఇటు అమరావతి: నిర్ణయం సీఎం చేతుల్లో!
కర్నూలు: అధికారంలోకి వచ్చిన మూడునెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోసం రెండు ప్రాంతాలు పోటీ పడుతున్నాయి. పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలను చేపడుతున్నాయి. రిలే నిరాహార దీక్షలకు దిగాయి. హైకోర్టును తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు, విద్యార్థులు.. ఉద్యమిస్తున్నారు. క్రమంగా ఈ డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగును కూడా పులుముకుంది. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదవి విప్పట్లేదు. ఏం మాట్లాడితే.. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రాయలసీమలో హైకోర్టు
రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టును వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదటి నుంచీ వినిపిస్తోంది. విభజన తరువాత అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడి హయాంలో దీనిపై పెద్దగా ఎవరూ స్పందించలేదు. రాష్ట్ర హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడమే దీనికి కారణం.
చంద్రబాబు అంచనాలు తారుమారు
ఇక కర్నూలుకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకునే సమయంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సైతం చంద్రబాబు ఇదే హామీని ఇచ్చారు. దాన్ని కార్యాచరణలోకి తీసుకుని రాలేకపోయారు. తాత్కాలిక హైకోర్టును రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో ఏర్పాటు చేశారు. శాశ్వతంగా దీన్ని కర్నూలుకు తీసుకుని వస్తామని ఆయన ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రజలకు భరోసా ఇచ్చినా..ఫలితాలు తారుమారు అయ్యాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతుల్లో ఉంది.
సీఎంతో బార్ అసోసియేషన్ నేతల భేటీ
కర్నూలు జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నంద్యాల పట్టణం జలమయమైంది. ఎప్పుడూ లేనవిధంగా కుందునది ఉధృతంగా ప్రవహించింది. నంద్యాల తీర ప్రాంతాన్ని ముంచెత్తింది. వరద బారిన పడిన నంద్యాలలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలుసుకున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.
కర్నూలోనే హైకోర్టు కావాలి
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని అడ్వకేట్ల సంఘాలు కోరాయి. వినతిపత్రాలను అందజేశారు. దీనిపై సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటానని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఆయన నంద్యాలలో పర్యటిస్తున్న రోజే.. కర్నూలు నగరంలో విద్యార్థులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. నగరంలోని రాజ్ విహార్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అక్కడే బైఠాయించారు. వందలాది మంది విద్యార్థులు, న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు.