రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి, తెల్ల కాగితంపై సంతకం చేయాలని..సలాం ఫ్యామిలీకి ఆగని వేధింపులు
అబ్దుల్ సలాం కుటుంబాన్ని పోలీసులు వదలడం లేదు. వేధింపుల వల్ల ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న.. ఇంటికొచ్చి మిగతా కుటుంబసభ్యులను హరాస్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత సలాం ఇంటికి పోలీసులు వచ్చారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా ఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు సలాం మాబున్నీసాను పిలిచారు. తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చారు.
సబ్ కలెక్టర్ ఫోన్ చేయడంతో..
అంతకుముందు సమస్య ఉంటే ఫోన్ చేయాలని సబ్ కలెక్టర్ కల్పనాకుమారి మాబున్నీసాకు సూచించారు. దీంతో ఆమె సబ్ కలెక్టర్కు ఫోన్ చేశారు. సబ్కలెక్టర్ వెంటనే డీఎస్పీ చిదానందరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. టైమ్కాని టైమ్లో సలాం ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వెంటనే వెనక్కి వెళ్లాలని ఆదేశించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆగని వేధింపులు
పోలీసు వేధింపులు ఆగలేదని సలాం అత్త మాబున్నీసా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియకు చెప్పారు. అఖిలప్రియ సబ్కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. న్యాయవాది సలహా మేరకు నడుచుకోవాలని మాబున్నీసా కుటుంబ సభ్యులకు అఖిలప్రియ సూచించారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.
ఎందుకు వచ్చామంటే..
సలాం కుటుంబానికి ప్రభుత్వం అందించే పరిహారం విషయంలో సలాం అత్త మాబున్నీసా బ్యాంక్ అకౌంట్ వివరాలు,సెల్నంబర్ తీసుకునేందుకు త్రీటౌన్ మహిళా ఎస్ఐ నగీన, కానిస్టేబుళ్లు బషీరున్నీబీ వెళ్లి అడిగారని త్రీటౌన్ సీఐ పేరుతో బుధవారం రాత్రి 7.30 గంటలకు ఓ ప్రకటన విడుదలయింది. ఇబ్బందిపెట్టే ఉద్దేశం లేదని, వారి పట్ల గౌరవంగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
ఇక వాదించను..
టీడీపీకి చెందిన రామచంద్రరావు వాదించడం వల్లే సలాం ఆత్మహత్య కేసు నిందితులకు బెయిల్ వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాది రామచంద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు. అతనిపై ఆరోపణలు వస్తున్న క్రమంలో నిర్ణయం తీసుకున్నారు. ఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ కోసం రామచంద్రరావు వాదనలు వినిపించారు. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్కు నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరిద్దరి బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం నంద్యాల కోర్టులో విచారణ జరుగనుంది.
Recommended Video
వేధింపులు తాళలేక
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆదివారం అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.