ఏపీలో బీజేపీకి మరో షాక్: ఆకుల తర్వాత మరో కీలక నేత రాజీనామా, ఏం చెప్పారంటే?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి (భారతీయ జనతా పార్టీ) మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా, విశాఖపట్నం జిల్లాలోను పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు.
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనే
చెరువు రామకోటయ్య రాజీనామా
విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ చెరువు రామకోటయ్య బీజేపీకి సోమవారం నాడు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏపీ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమానికి తాను తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం చిన్నచూపు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారడం తెలిసిందే. అయితే బీజేపీ నుంచి అలాంటివి తక్కువగా చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా కనిపించే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. 2014లో ఏపీ నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆకుల సత్యనారాయణ, విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస రావు, పైడికొండల మాణిక్యాల రావులు గెలిచారు.
వీరిపై ప్రచారం
వీరిలో మాణిక్యాల రావు బీజేపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. కామినేని గత కొన్నాళ్లుగా మౌనంగా కనిపిస్తున్నారు. బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఉన్న విష్ణు కుమార్ రాజు టీడీపీకి అనుకూలమనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే, ఈ వదంతులను ఆయన కొట్టి పారేశారు కూడా.
ఆకుల సత్యనారాయణ ఏమన్నారంటే
రాజీనామా వార్తల పైన స్పందించిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆకుల సత్యనారాయణ... తాను ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదన్నారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వచ్చానని అన్నారు. ఇంకా అపాయింటుమెంట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారని చెప్పారు. ఆయనను కలిసిన తర్వాత తాను తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారు.
జనసేన వైపు ఆకుల సతీమణి
కాగా, ఆకుల సత్యనారాయణ భార్య లక్ష్మీ పద్మావతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అభిమాని. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె దీక్ష చేశారు. ఇటీవల జనసేన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.