రాజధాని రాకతో విశాఖలో దారి తప్పుతున్న టీడీపీ రాజకీయం.. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. ?
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన వైసీపీకి మంచి మైలేజ్ తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ సీట్లతో పోలిస్తే కొత్త రాజధాని విశాఖలో ఉన్న ఐదు సీట్లలో వైసీపీ రాజకీయం అనుకూలంగా మారనుండటం జగన్ కు ఊరటనిస్తోంది. దీంతో టీడీపీ కార్యక్రమాలకు, ఏకంగా అధినేత చంద్రబాబు టూర్ కు సైతం స్ధానిక ఎమ్మెల్యేలు దూరంగా జరిగే స్ధాయిలో విశాఖ రాజకీయం మారిపోయిందంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఊహించవచ్చు.
విశాఖ రాజధాని ప్రకటన- పరిణామాలు..
వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన నగరంగా ఉన్న విశాఖలో టీడీపీ రాజకీయంగా చాలా బలంగా ఉంది. కొన్నేళ్లుగా నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలు వరుస విజయాలతో ఊపుమీద ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నగరంలోని గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడించిన వైసీపీ.. మిగిలిన నాలుగు సీట్లలో మాత్రం టీడీపీ హవాను అడ్డుకోలేకపోయింది. ఇది గత డిసెంబర్ 17 ముందు వరకూ అక్కడున్న పరిస్ధితి. కానీ అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రకటనతో పరిస్దితి ఒక్కసారిగా మారిపోయింది.
విశాఖను వదిలి అమరావతి...
ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతంలో కొత్తగా ఏదైనా అభివృద్ధి అవకాశం వస్తే కాదనే రాజకీయ నేతలు, పార్టీలు ఉండవు. కానీ విశాఖలో పరిస్ధితి వేరు. అప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని కాదని విశాఖలో రాజధాని ఎలా పెడతారంటూ టీడీపీ ఉద్యమానికి సిద్దమైంది. కానీ అప్పటికే రాజధాని ప్రకటనతో హ్యాపీగా ఉన్న విశాఖ ప్రజలకు అమరావతి రాజధానికి మద్దతివ్వమని కోరలేక, అలాగేని టీడీపీలో ఉంటూ విశాఖ రాజధానిని సమర్ధించలేక అక్కడి ఎమ్మెల్యేలు నలిగిపోయారు. చివరికి మౌనాన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు.
టీడీపీ నుంచి వైసీపీకి....
విశాఖలో మారుతున్న రాజకీయ పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్, గణబాబు .. మొన్నటి చంద్రబాబు విశాఖ టూర్ కు దూరంగా ఉండిపోయారు. చివరికి ఎయిర్ పోర్టులో చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నా ఆయనకు మద్దతుగా అక్కడికి రాలేదు. మిగిలిన జిల్లాల నేతలు, మాజీ మంత్రులు మాత్రమే అక్కడికి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు దీంతో భవిష్యత్తులో విశాఖ రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోందో స్పష్టమైపోయింది. ఇప్పటికే టీడీపీ జిల్లా రూరల్ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరి బాటలోనే త్వరలో ఎమ్మెల్యేలు కూడా పయనిస్తారని భావిస్తున్నారు.
Recommended Video
ప్రత్యామ్నాయాలపై టీడీపీ దృష్టి..
రాజధాని ప్రకటన తర్వాత మారిన పరిస్ధితుల్లో విశాఖ నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉందని అనుమానిస్తున్న అధిష్టానం ఇప్పటికే అక్కడ ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాకపోయినా ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని సమాచారం. అదే జరిగితే టీడీపీకి కొత్త రాజధానిలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదే సమయంలో విశాఖపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి రాజధాని వస్తున్న వేళ స్ధానిక రాజకీయం అనుకూలంగా మారుతుంది.