వైసీపీ సర్కార్కు బాక్సైట్ దెబ్బ- అన్రాక్ షాకులతో కేంద్రం, ఒడిశావైపు చూపులు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటు చేసుకున్న మార్పులు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఏపీ పరువు బజారుకీడుస్తున్నాయి. విశాఖ మన్యం నుంచి బాక్సైట్ తవ్వుకునేందుకు ఓ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరాకరించడంతో ఒప్పందం కుదుర్చుకున్న అన్రాక్ సంస్ధ తీవ్ర న్యాయపోరాటం చేస్తోంది. దీంతో ప్రస్తుతం జగన్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. చివరికి ఒడిశా నుంచి బాక్సైట్ ఇప్పించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నా అది కూడా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆదారపడాల్సిన పరిస్ధితి కల్పిస్తోంది.
వైఎస్ హయాం బాక్సైట్ ఒప్పందాలు
గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో విశాఖ జిల్లాలో రెండు బాక్సైట్ ఒప్పందాలు చేసుకున్నారు. 2005లో జిందాల్ సంస్ధతోనూ, 2007లో యూఏఈలోని రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్ధ అన్రాక్తో ఈ ఒప్పందాలు జరిగాయి. వాటి ప్రకారం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వి ఆయా సంస్ధలకు 30 ఏళ్ల పాటు సరఫరా చేసేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్ధకు బాధ్యతలు అప్పగించారు.
అయితే విశాఖ నగరంతో పాటు పలు చోట్ల ఆయా సంస్ధలు ఏర్పాటు చేసే అల్యూమినియం రిఫైనరీలకు స్ధానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అప్పటి ప్రభుత్వం ఇరుకునబడింది. స్ధానికంగా అభ్యంతరాలను పట్టించుకోకుండా చేసుకున్న ఒప్పందాలు ప్రభుత్వాలకు గుదిబండలా మారిపోయాయి.
చంద్రబాబు హయాంలో ఒప్పందాలు రద్దు...
చంద్రబాబు అదికారంలోకి వచ్చాక విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో ఇచ్చిన ఒప్పందాలను రద్దు చేశారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల వ్యతిరేకతకు కారణమైన బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై ఒప్పందాలు కుదుర్చుకున్న జిందాల్, అన్రాక్ సంస్ధలు న్యాయపోరాటం ప్రారంభించాయి. హైకోర్టులో ఓసారి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆ తర్వాత మాత్రం వాటికి చుక్కెదురైంది. అయితే వారు అక్కడితో ఆగిపోలేదు. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్తో పాటు అంతర్జాతీయ కోర్టును సైతం ఆశ్రయించాయి.
జగన్ వచ్చాక లీజులూ రద్దు...
చంద్రబాబు స్ధానంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలకు కొనసాగింపుగా బాక్సైట్ మైనింగ్ లీజులను కూడా రద్దు చేసింది. దీంతో అప్పట్లో లీజుల కోసం ఒప్పందాలు చేసుకున్న జిందాల్, అన్రాక్ సంస్ధలు న్యాయపోరాటం చేస్తున్నాయి. వీటిలో అన్రాక్ జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్, అంతర్జాతీయ కోర్టుల్లో వేసిన కేసులు జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
వీటిపై ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్ధితిలోకి ప్రభుత్వం వెళ్లిపోతోంది. చట్టబద్ధంగా చేసుకున్న ఒప్పందాలను ప్రజా ప్రయోజనాల పేరుతో అర్ధాంతరంగా రద్దు చేయడంతో ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాలని ఆయా సంస్ధలు కోరుతున్నాయి. వీటిని చెల్లించే పరిస్దితిలో ప్రభుత్వం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
కేంద్రం, ఒడిశా వైపు జగన్ చూపులు...
విశాఖ మన్యంలో ఒప్పందాలు చేసుకున్నాక బాక్సైట్ లీజులను, ఒప్పందాలను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వాన్ని దుబాయ్కు చెందిన రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్ధ అన్రాక్ తీవ్రంగా చికాకుపెడుతోంది. దీంతో ఏపీ సర్కార్ ఇప్పుడు ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఒడిశాలోని మైనింగ్ గనుల నుంచి బాక్సైట్ తీసుకుని అన్రాక్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అక్కడ ఒడిశా మైనింగ్ కార్పోరేషన్ ఇప్పటికే తమ గనుల నుంచి 70 శాతం ఖనిజాన్ని వేదాంత సంస్ధకు ఇచ్చేస్తోంది.
మిగిలిన 30 శాతం కూడా వేలంలో పాడుకోవాలని సూచిస్తోంది. దీంతో వేలంలో భారీ మొత్తాలు చెల్లించి లీజు తీసుకోలేక, అలాగని అన్రాక్తో పోరాటం చేయలేక ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. మధ్యే మార్గంగా కేంద్రం జోక్యం చేసుకుని వేలం లేకుండా తమకు ఒడిశా బాక్సైట్ ఇప్పించాలని కోరేందుకు జగన్ సర్కార్సిద్ధమవుతోంది.