సీఎం జగన్కు కేంద్రం సహకరిస్తుందా: మండలి రద్దు తీర్మానం ఆమోదిస్తుందా: మారుతున్న సమీకరణాలు!
కొంత కాలంగా అంచనా వేస్తున్నట్లుగా ఏపీ కేబినెట్ శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల కాలంలోనే తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును శాసన సభ ఆమోదించి.. మండలికి పంపగా తొలి నుండి టీడీపీ తమకున్న అవకాశాలను వినియోగిస్తూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే విధంగా సభలో ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఛైర్మన్ తన విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ముఖ్యమంత్రి దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకు న్నారు. వెంటనే మండలి రద్దు దిశగా ఆలోచన చేసారు. దీని పైన అభిప్రాయాలు తెలుసుకోవటానికి మూడు రోజుల సమయం కేటాయించారు. ఆ వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మండలి రద్దు చేయా లని నిర్ణయం తీసుకున్నారు. దీనిని తీర్మానం రూపంలో కేంద్రానిని నివేదించనున్నారు. ఇక, ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం కానుంది. దీని పైన బీజేపీ నేతల అంచనాలు ఏంటి..
అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం..
మండలి రద్దు చేస్తే ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో..ఇక శాసనసభలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించనున్నారు. ఈ తీర్మానం పైన చర్చ తరువాత తీర్మానం ఆమోదిస్తారు. ఏపీలో మండలిని రద్దు చేయాలనే ఈ తీర్మానాన్ని కేంద్రానికి నివేదిస్తారు. ఆ తీర్మానం తొలుత కేంద్ర హోం శాఖకు చేరుతుంది. అక్కడ తీర్మానం పరిశీలించి.. కేంద్ర హోం మంత్రి..ప్రధాని అంగీకరిస్తే కేంద్ర కేబినెట్ సమావేశంలో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే పార్లమెంట్ లోని రెండు సభల్లోనూ ఆమోదం పొందాలి. ఆ తరువాత మాత్రమే తిరిగి హోం శాఖ రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఆయన ఆమోదం పొందిన తరువాత మండలి రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కానుంది. అప్పటి వరకు మండలి రద్దు ప్రక్రియ అమల్లోనే ఉంటుంది. కానీ, మండలి సభ కొనసాగటం.. చర్చలు నిర్వహించటం యధా తధంగా కొనసాగుతుంది.
బీజేపీ నేతల అంచనాలు ఏంటి..
ఏపీ శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోము వీర్రాజు.. మాధవ్ నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా..నారాయణ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారు. అయితే, తమ పార్టీకి చెందిన సభ్యులెవరూ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. ఇక, ఇప్పడు తాజా నిర్ణయంతో మండలిలోనూ అవకాశం కోల్పోతారు. అయితే, ఇద్దరు సభ్యుల కోసం బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేయదని.. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపగా అప్పటి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి కి కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాల ఆధారంగానే దీని పైన నిర్ణయం వెలువడుతుందని వారి అంచనా.
Recommended Video
రెండేళ్లు పడుతుందని టీడీపీ వాదన
ఇక, ఇప్పుడు మండలి రద్దు అధికారం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండదని..దీనిని తీర్మానం రూపంలో కేంద్రానికి నివేదించటం వరకు ప్రభుత్వ పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక, లోక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే, కేంద్రం వద్ద అనేక తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయని..వాటి పైన నిర్ణయం తో పాటే ఏపీ మండలి పైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ మాత్రం ఈ మొత్తం ప్రక్రియ రెండేళ్ల వరకు పడుతుందని అంచనా వేస్తోంది. వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే కేంద్ర మండళ్ల రుద్ద పైన 2017లోనే ఆలోచనలు చేసింద ని..ఇప్పుడు దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోవటంతో..దాదాపు త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఏపీ మండలి రద్దు తీర్మానం పైన కేంద్ర స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.