హైడ్రామా, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్: 14 రోజుల కస్టడీ, రోజా హౌస్ అరెస్ట్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిని హైడ్రామా మధ్య పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం అతనికి శ్రీకాళహస్తి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన దాడి కేసులో శనివారం రాత్రి పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం అతనికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు.
గట్టి బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిథున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై జడ్జి ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు. నేడు కోర్టులకు సెలవు కావడంతో రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశముంది.
అంతకుముందు పోలీసులు మాట్లాడుతూ... ఎయిరిండియా మేనేజరుపై దాడి చేసిన కేసులో తాము మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులను జారీ చేశామని తెలిపారు.
వాటి కారణంగా చెన్నై విమానాశ్రయంలో కనిపించిన మిథున్ రెడ్డిని, అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆపై తిరుపతి పోలీసులకు అప్పగించారన్నారు. మిథున్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి సైతం విమానాశ్రయంలో పట్టుబడ్డారని, వీరిద్దరినీ కేసు నమోదైన శ్రీకాళహస్తికి తీసుకువచ్చి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని చెప్పారు.
మిథన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో
మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మిథున్ అరెస్టు అన్యాయమని ఆందోళన నిర్వహించారు. టిడిపి కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు. వైసిపిని అణగదొక్కేందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు.
మిథున్ రెడ్డి అనుచరులను చితూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేశారు. మిథున్ రెడ్డిని శనివారం అర్థరాత్రి చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు పీలేరు నుంచి తిరుపతికి బయలుదేరిన ఆయన అనుచరులు దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేసి పీలేరు స్టేషన్కు తరలించారు. రోజాను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.