కుటుంబ వివాదమంటూ బాలకృష్ణ ఫోన్: పీఏ వివాదానికి తెరపడింది!
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఇటీవల ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్తో తెరపడినట్లు సమాచారం.
హిందూపురం: గత కొద్ది రోజులుగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్ రెడ్డి వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో చెలరేగిన వివాదాలు, విభేదాలు తొలగిపోయినట్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఇటీవల ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్తో తెరపడినట్లు సమాచారం.
పీఏ శేఖర్ను సాగనంపాలని ఒక వర్గం, ఉంచాలని మరో వర్గం గత నెల రోజులుగా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొద్ది రోజులుగా జరిగిన అన్ని విషయాలపై కలత చెందానని, ఇది కుటుంబ సమస్య అని అందరూ కలిసి కూర్చుని చర్చించుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన విషయాలను పక్కన పెట్టి ఇక నుంచి అందరిని కలుపుకుని వెళ్లి హిందూపురంను అభివృద్ధి చేద్దామని చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 28న హైదరాబాద్ రావాలని ఇక్కడ అందరం కలిసి చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఇందుకు సీసీ, అంబికా కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో సీసీ ఇంట్లో సమావేశమైన అంబికా, తెలుగు తమ్ముళ్లు బాలయ్య చెప్పిన విషయాలపై చర్చించారు. పీఏ శేఖర్ వ్యవహారం, ఇతర విషయాలపై నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయేందుకు దారితీసిన అంశాలపై ఎమ్మెల్యేకు సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్గా వచ్చిన కృష్ణమూర్తి సమగ్ర నివేదిక అందించారు.
అదే విధంగా పీఏ శేఖర్పై నెలకొన్న అనిశ్చితికి శనివారం తెరదింపుతున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఫోన్ విషయమై సీసీ, అంబికా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడాడని మంగళవారం హైదరాబాద్కు రావాలని, అన్ని విషయాలు కలిసి మాట్లాడదామని పిలుపునిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో హిందూపురంలో నెలకొన్న పీఏ వివాదం, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయే అవకాశం కనిపిస్తోంది.