బీరుట్ పేలుళ్లతో విశాఖకూ లింకా ? మీడియా కథనాలతో చర్చ - అసలు వాస్తవమేంటి ?
లెబనాన్ రాజధాని బీరుట్లో సంభవించిన భారీ పేలుళ్ల శబ్దాలు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవులకూ వినిపించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 4 వేల మంది వరకూ గాయాలపాలైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పేలుళ్లకు కారణమైన అమ్మోనియం నైట్రైట్ నిల్వలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే పోర్టులన్నీ అప్రమత్తమయ్యాయి. ఇదే కోవలో మన దేశంలోనూ అమ్మోనియం నైట్రేట్ దిగుమతులకు అనుమతి ఉన్న విశాఖ పోర్టు భద్రతపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇందులో వాస్తవమెంత ?
విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం, విరిగిపడ్డ క్రేన్, పది మంది మృతి
బీరుట్ పేలుళ్లతో విశాఖ లింకు..
వాస్తవానికి బీరుట్ పేలుళ్లతో విశాఖకు ఎలాంటి లింకూ లేదు. కానీ బీరుట్ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఆరేళ్లుగా ఉండిపోవడంతో కెమికల్ రియాక్షన్ లేదా మరే ఇతర కారణంతో భారీ పేలుడుకు కారణమయ్యాయి. కానీ వీటితో విశాఖ పోర్టుకు లింకేమిటన్న సందేహాలు వస్తాయి. పేలుడుకు అవకాశం కలిగిన అమ్మోనియం నైట్రైట్ నిల్వలను దిగుమతి చేసుకునేందుకు అన్ని దేశాల్లో అన్ని పోర్టులకూ అనుమతులు ఇవ్వరు. కేవలం కొన్ని ఎంపిక చేసిన పోర్టుల్లో మాత్రమే ఈ రసాయన దిగుమతులకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి. ఇలా అరుదైన అనుమతి కలిగిన పోర్టుల్లో ఏపీలోని విశాఖ పోర్టు కూడా ఒకటి. ఆ మాటకొస్తే దేశంలోనే ఈ అనుమతులు కలిగిన ఏకైక పోర్టు విశాఖ మాత్రమే అని కూడా తెలుస్తోంది.
విశాఖ పోర్టు భద్రతపై చర్చ..
బీరుట్ పోర్టులో అమ్మోనియం నైట్రైట్ పేలుడు వీడియోలు చూసిన వారికి మన దేశంలో ఈ రసాయనం దిగుమతి అనుమతి ఉన్న విశాఖపట్నంలో ఇలాంటి పేలుడే సంభవిస్తే పరిస్ధితి ఎలా ఉంటుందన్న అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై మీడియాలోనూ అదే ప్రచారం జరగడంతో సహజంగానే ప్రజల్లోనూ భయాలు మొదలయ్యాయి. అసలే పాలనా రాజధానిగా ఎంపికైన తర్వాత విశాఖలో జరుగుతున్న వరుస రసాయన ప్రమాదాలతో భయంభయంగా గడుపుతున్న నగర వాసులకు ఈ కొత్త సందేహాలు నిద్ర పట్టనివ్వడం లేదు. అమ్మోనియం నైట్రైట్ పేలుడు జరుగుతుందా లేదా అన్న వాదన తర్వాత అసలు విశాఖ పోర్టుకు అనుమతులు ఎందుకిచ్చారనే చర్చ కూడా సాగుతోంది. అయితే విశాఖ పోర్టుకు ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా ఈ రసాయన దిగుమతులకు గతంలో అనుమతులు ఇచ్చారు.
దిగుమతి ఆషామాషీ కాదు...
విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రైట్ దిగుమతికి అనుమతి ఉన్నప్పటికీ అందులో ఎన్నో ఆంక్షలున్నాయి. అషామాషీగా విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు. ఈ రసాయనం తీసుకొచ్చిన నౌకలకు పోర్టులో బెర్త్ కేటాయించాలంటే పోలీస్, కస్టమ్స్, సేఫ్టీ, ఫైర్, పెసో అనుమతులు ఉండాల్సిందే. నౌక సముద్రంలో ఉండగానే ఈ అనుమతులన్నీ పొందాల్సి ఉంటుంది.
ఆ తర్వాతే దానికి బెర్త్ కేటాయింపు ఉంటుంది. అలాగే విశాఖ నౌకాశ్రయంలో అమ్మోనియం నైట్రైట్ నిల్వకు కూడా అవకాశం లేదు. నౌక నుంచి వెంటనే దిగుమతి చేసుకోవడం, ఆ వెంటనే సంబంధిత పరిశ్రమలకు తరలించడం చకచకా జరిగిపోతాయి. ఇతర రాష్ట్రాలకు సైతం తరలించేందుకు 35 రోజుల గరిష్ట వ్యవధి మాత్రమే ఉంటుంది.
Recommended Video
విశాఖ పోర్టుకే ఎందుకంటే..
ఒకప్పుడు దేశంలోని అన్ని పోర్టులకు అమ్మోనియం నైట్రేట్ దిగుమతులకు అనుమతులు ఉండేవి. కానీ ప్రమాదాల దృష్ట్యా పెట్రోలియం పేలుడు పదార్ధాల భద్రతా సంస్ధ (పెసో) దీనిపై నియంత్రణలు విధించింది. దీంతో దేశంలో భద్రతా పరంగా అన్ని రకాలుగా మెరుగ్గా ఉన్న విశాఖ పోర్టు ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు భారీగా ఖర్చవుతున్నా కేంద్రం కూడా విశాఖవైపే మొగ్గు చూపాల్సిన పరిస్దితి. దీంతో పాటు విశాఖ పోర్టు వ్యూహాత్మకంగా తూర్పు నావల్ కమాండ్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ తీవ్ర వాద దాడులే కాదు పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రతీ నౌకపైనా కోస్ట్ గార్డ్ దృష్టి ఉంటుంది. నేవీ కంట పడకుండా ఇక్కడ ఏదీ జరగదు. అందుకే కేంద్రం కూడా దీన్నో ప్రత్యేక పోర్టుగా గుర్తించి ఇక్కడ ప్రమాదకర రసాయనాల దిగుమతులకు అనుమతిచ్చింది.