ఎన్నికలకి రండి: వైసిపి, కర్నూల్లో ఆసక్తికరం.. ఒకే పార్టీలో ఆ నేతలు
కర్నూలు: పార్టీని వీడిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైసిపి ఉప ఎన్నికలకు సిద్ధమని ఆ పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి తదితరులు సవాల్ చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీ వీడటాన్ని వైసిపి జీర్ణించుకోలేకపోతోంది. జగన్కు నమ్మినబంటులా ఉన్న భూమా నాగిరెడ్డి చేరికను మిగతా వైసిపి నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో టిడిపి తుడిచి పెట్టుకు పోయిందని, ఏపీలో వైసిపి బలపడటం జీర్ణించుకోలేక చంద్రబాబు చేరికలకు తెరలేపారని మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా, భూమా నాగిరెడ్డి చేరికతో కర్నూలు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఒకే ఒరలోకి మూడు నాలుగు కత్తులు చేరినట్లయింది. కర్నూలు జిల్లాలో గతంలో కత్తులు దూసుకున్న భూమా, గంగుల, ఇరిగెల కుటుంబం ఇప్పుడు టిడిపిలో ఉండటం గమనార్హం.
భూమా నాగిరెడ్డి కుటుంబం గతంలో టిడిపిలో ఉన్నప్పుడు గంగుల కుటుంబం, ఇరిగెల కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇలా.. ఓ కుటుంబం ఓ పార్టీలో ఉంటే మరో కుటుంబం మరో పార్టీలోకి వెళ్లేది. ఇక్కడ పార్టీల కంటే నాయకుల హవానే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అయితే, గతంలో కత్తులు దూసుకున్న వారే ఇప్పుడు ఒకే పార్టీలో చేరిపోయారు. దీంతో కర్నూలు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గంగుల ప్రతాప్ రెడ్డి గతంలోనే టిడిపిలో చేరారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ చేరారు.
మరోవైపు శిల్పా సోదరులు (శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి)లు కూడా జిల్లాలో చక్రం తిప్పుతుంటారు. ఇలా అందరు సైకిల్ ఎక్కడంపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. జిల్లా నుంచి కెఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తంగా కర్నూలు టిడిపిలో కీలక నేతల తీరు ఆసక్తిని రేపుతున్నాయంటున్నారు.
భూమా నాగిరెడ్డికి లేదా కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని దాదాపు తేలిపోయింది. భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గానికి శిల్పా మోహన్ రెడ్డి ఇంఛార్జిగా ఉన్నారు. అంతేకాదు, ఇటీవల నంద్యాలలో జరిగిన వివాదంలో భూమా పైన కేసు నమోదయింది. శిల్పా, భూమాల మధ్య వాగ్వాదం జరిగింది.