క్లారిటీ ఇచ్చేసిన చిరంజీవి-ఇక తేల్చుకోవాల్సింది జగనే ! ఆయనతో కలిస్తే డేంజరే ?
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయంగా ఇన్నాళ్లూ జగన్ కు సన్నిహితంగా మెలిగిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్ కే నని ప్రకటించేశారు. అంతే కాదు పవన్ కోసమే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కూడా తేల్చిచెప్పేశారు. దీంతో ఇక ఇన్నాళ్లూ తమ రాజకీయాలకు చిరంజీవిని వాడుకున్న జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. ఇక్కడ ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా జగన్ కు రాజకీయంగా నష్టం తప్పేలాలేదు.
జగన్-చిరంజీవి బంధం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీకి, చంద్రబాబుకు ఎప్పుడూ అండగా ఉంటే టాలీవుడ్ పెద్దలంతా దూరంగా ఉండిపోయారు. ఏపీలో సినిమా షూటింగ్స్ తో పాటు ఇతరత్రా వ్యవహారాల్లో ప్రభుత్వం అవసరం ఉన్నా కనీస మర్యాద చూపకుండా జగన్ కు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవి మాత్రం వీరితో సంబంధం లేకుండా అప్పటికే జగన్ కు ఆప్తమిత్రుడైన నాగార్జునతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చికలిశారు. అప్పటి నుంచి జగన్ తో చిరంజీవి బంధం బలపడుతూ వచ్చింది. చివరికి సినిమా టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్ హీరోలతో జగన్ నిర్వహించిన భేటీలోనూ చిరంజీవి ఆయనకు దండం పెడుతున్న ఫొటోలు మెగాస్టార్ అభిమానుల్ని డిస్ట్రబ్ చేసినా పట్టించుకోలేదు.
తమ్ముడికే మద్దతన్న చిరంజీవి
కానీ తాజాగా తాను నటించిన గాడ్ ఫాదర్ చిత్ర ప్రెస్ మీట్లో మాత్రం తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజకీయంగా తాను తమ్ముడికే అండగా ఉంటానని, అందుకోసమే తాను మరో పార్టీలోకి వెళ్లలేదని, భవిష్యత్తులో ఆయన్ని సీఎంగా చూసేరోజు వస్తుందంటూ పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అంతకు ముందే తాను రాజకీయాన్ని వదిలేసినా రాజకీయం తనను వదిలేయలేదంటూ గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కోసం చెప్పిన డైలాగ్ ఉండనే ఉంది. దీంతో ఈ రెండు అంశాలతో చిరు అభిమానులకే కాదు వైసీపీ నాయకులకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
చిరు యూటర్న్ తో జగన్ కు షాక్ ?
ఇన్నాళ్లూ టాలీవుడ్ లో మిగతా పెద్దలంతా ఎలా ఉన్నా చిరంజీవి నుంచి లభించిన మద్దతుతో వైఎస్ జగన్ సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో టాలీవుడ్ ను తమవైపు తిప్పేందుకు చిరంజీవి చేసిన ప్రయత్నాలతో జగన్ కు ఆయన మరింత దగ్గరయ్యారు. ఓ దశలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ దూరం చేసేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ తో కలిసి ఆయన ఇంట్లోనే విందు భోజనాలు కూడా చేసిన చిరంజీవి ఇప్పుడు తన తాజా వ్యాఖ్యలతో పూర్తిగా హ్యాండిచ్చేసినట్లయింది. దీంతో జగన్ ను కాదని తమ్ముడు పవన్ కే తమ మద్దతంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు జగన్ కు కూడా షాకింగ్ గా మారాయి.
జగన్ తక్షణ కర్తవ్యం ఇదేనా ?
ఇప్పటివరకూ తమ వాడనుకున్న చిరంజీవి కాస్తా తమ్ముడు పవన్ కళ్యాణ్ కే తన మద్దతంటూ ప్రకటన చేయడంతో ఇప్పుడు జగన్ తదుపరి ప్లాన్ ఎలా ఉండబోతుందన్న చర్చ సాగుతోంది. చిరంజీవి దూరమైనా ఇప్పటికిప్పుడు జగన్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ భవిష్యత్తులో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం చిరంజీవి తమ్ముడు పవన్ పదవి కోసం చంద్రబాబుతోనూ లాబీయింగ్ చేయాల్సిన పరిస్ధితులు ఎదురుకాక తప్పదు. అలా జరగకుండా ఆపే శక్తి జగన్ కు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తనకు దూరమైన చిరంజీవి భవిష్యత్తులో టీడీపీ-జనసేన కూటమికి దగ్గరకాకుండా చూసుకోవడమే ఇప్పుడు జగన్ ముందున్న తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.