గుంటూరులో మరో దారుణం: బాలికపై తాపీకూలి అత్యాచారం..
గుంటూరు: దాచేపల్లి అత్యాచార ఘటనతో దావానంలా ఎగసిపడ్డ నిరసనలు ఇంకా చల్లారనేలేదు, ఇంతలోనే జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. తాజా ఘటనలో ఓ తాపీకూలీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో ఈ ఘటన జరిగింది. నిందితుడిని నాగూర్ మీరాగా గుర్తించారు. ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. 'ఆడబిడ్డకు అండగా కదులుదాం' అంటూ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.
ఆడబిడ్డకు అండగా కదులుదాం:
బాలికలు, మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన మద్దతు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఫోన్ చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని చంద్రబాబుతో సత్యార్థి కైలాష్ చెప్పినట్టు సమాచారం.