ఢిల్లీ మత ప్రార్థనలతో ఏపీ ఉలికిపాటు: మంత్రులకు టాస్క్.. బరిలో వలంటీర్లు: ప్రాంతాల వారీగా స్కానింగ్.
అమరావతి: దేశ రాజధానిలోని ప్రఖ్యాత హజ్రత్ నిజాముద్దీన్ మసీదు సమీపంలోని మర్కాజ్ ప్రాంతంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల ఉదంతం.. ఏపీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. కొత్తగా నమోదైన కేసులకు ఈ మత ప్రార్థనలకు సంబంధం ఉండటం ఉలికిపాటుకు ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేస్తోంది. ఎంతమంది ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్నారనే విషయంపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే.. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లొచ్చినట్లు ప్రాథమికంగా నిర్దారించింది. దీనితో ప్రాంతాలవారీగా స్కానింగ్ చేస్తోంది.
స్వచ్ఛందంగా బయటికి వస్తే గానీ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో వందలాది మంది ఒకేచోట గుమికూడి మత ప్రార్థనల్లో పాల్గొనడం వల్ల పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. మత ప్రార్థనల్లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు వెళ్లిన వారంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను చేయించుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఙప్తి చేస్తున్నాయి. వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి ఆరు మంది మరణించడం, వారంతా ఈ ప్రార్థనలకు హాజరైన వారే కావడం.. దాని తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ప్రాంతాలవారీగా జల్లెడ..
ఉత్తరాంధ్రలోని ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి 15 మంది వరకు మర్కాజ్ ప్రాంతంలో నిర్వహించిన తబ్లిఘి జమాత్ ప్రార్థనలకు హాజరైనట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనితో వారి గురించి ఆరా తీస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై ప్రత్యేకంగా నిఘా వేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రాంతాలవారీగా జల్లెడ పడుతోంది. మంత్రుల దీనికోసం వలంటీర్లను బరిలోకి దింపింది. యుద్ధప్రాతిపదికన వారిని గుర్తించాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. వలంటీర్లందరూ మరోసారి ఇంటింటికీ వెళ్లి, ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వారి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
మంత్రులకు టాస్క్..
ఢిల్లీ తబ్లిఘి జమాత్ ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిని గుర్తించే బాధ్యతను మంత్రులు, ఐఎఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్కు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆతర అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తూ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. దీనితో పాటు- ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది.