జగన్ లేఖ నేపథ్యంగా మరో ట్విస్ట్- డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యల్ని పిల్గా స్వీకరించిన సుప్రీంకోర్టు..
ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు ఛీఫ్జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై నెలరోజులుగా స్పందించని సుప్రీంకోర్టు.. ఇవాళ దాన్ని ప్రజాప్రయోజన వాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఓవైపు హైకోర్టు వ్యవహారశైలిపై సుప్రీం ఛీఫ్జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంతకంటే ముందే హైకోర్టుపై దాఖలైన ఫిర్యాదును సుప్రీంకోర్టు పిల్గా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ లేఖ కంటే ముందే దాదాపు అవే ఆరోపణలతో దాఖలైన ఫిర్యాదుపై ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.
కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ , సీఎం జగన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
డీజీపీపై ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు..
ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు ఈ మధ్య కాలంలో తీవ్రంగా స్పందిస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్లు, సీఐడీ కేసులు, ఇతర నిబంధనల ఉల్లంఘన కేసుల్లో పోలీసుల పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో ఓ కేసు విచారణ సందర్భంగా.. పోలీసులను నియంత్రించలేకపోతే మీ పదవికి రాజీనామా చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ను ఉద్దేశించి ఘాటు వాఖ్యలు చేసింది. పదేపదే పోలీసుల పనితీరు వివాదాస్పదమవుతున్న తరుణంలో హైకోర్టు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిపించడంతో పాటు న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై చర్చ జరిగింది. అయితే అప్పట్లో డీజీపీ కూడా కోర్టుకు తగిన వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్లయింది.
హైకోర్టు వ్యాఖ్యలపై ఛీఫ్జస్టిస్కు ఫిర్యాదు..
డీజీపీని ఉద్దేశించి పోలీసు వ్యవస్ధను నియంత్రిస్తారా లేక రాజీనామా చేసి వెళతారా అంటూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన కోటేశ్వరరావు అనే న్యాయవాది ఏకంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. ఇందులో కోటేశ్వరరరావు హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇస్తున్న ప్రతికూల తీర్పులు, వాటి పర్యవసనాలు, మీడియా కవరేజీ, జూనియర్ లాయర్లు సైతం హైకోర్టులో పిటిషన్లు వేసి ఎలా తమకు కావాల్సిన ఉత్తర్వులు పొందుతున్నారో పూసగుచ్చినట్లు వివరించారు. పలు కేసుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలు, వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ వాటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
Recommended Video
ఫిర్యాదును పిల్గా స్వీకరించిన సుప్రీంకోర్టు...
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల వ్యవహారశైలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న తీర్పులతో పాటు పలు అంశాలపై కోటేశ్వరరావు ఛీఫ్ జస్టిస్కు గత నెలలో చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించింది. ఈ ఫిర్యాదునే పిల్గా స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిల్పై త్వరలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపలణపై సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వాజ్యం రూపంలో విచారణ చేపట్టబోతోంది. అయితే తాజాగా సీఎం జగన్ కూడా ఇవే ఆరోపణలతో ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు లేఖ రాసిన నేపథ్యంలో ఈ పిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ లేఖ కంటే ముందు వచ్చిన లేఖ ఆధారంగా ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపితే ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.