మోడీ మీదే బాధ్యత: సర్జికల్ స్ట్రయిక్పై జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి అబద్దమని చాలామంది భావిస్తున్నారని ఆయన అన్నారు. ఆ అపోహలు తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు.
ఆయన ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సర్జికల్ స్ట్రయిక్స్ అబద్దమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వారిలోని అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ పైనే ఉందని తెలిపారు.
అందరికీ చూపించలేరు కాబట్టి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వారికి సర్జికల్ స్ట్రయిక్కు చెందిన వీడియోలను చూపించాలన్నారు. అప్పుడు ఆ వీడియోలోని వివరాలను మన్మోహన్ బయటకు చెప్పకున్నా, వాస్తవమే అని చెబితే చాలన్నారు.
కాగా, ఇప్పటికే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లు సర్జికల్ స్ట్రయిక్ దాడులకు చెందిన వీడియోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేసీ మాత్రం మన్మోహన్ లాంటి వాళ్లకు చూపించి, అవి వాస్తవమేనని చెప్పించాలని సూచించారు.