జూ.ఎన్టీఆర్.. మోత్కుపల్లి నోట లక్ష్మీపార్వతి మాట: బాబుకు అదే కోపం తెప్పించింది! వెనుక 3 అంశాలు
విజయవాడ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విషయంలో మరోసారి కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే ఒంటి కాలిపై లేచే వారి నుంచి మొదలు ఆయన వద్ద పని చేసిన నేతలు కూడా ఈ కొత్త డిమాండ్పై గట్టిగా మాట్లాడుతున్నారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని అంటున్నారు.
Recommended Video
చదవండి: మోత్కుపల్లికి ఝలక్, టీడీపీ నుంచి బహిష్కరణ: గవర్నర్ పదవిపై కొత్త విషయం చెప్పిన ఎల్ రమణ
వారసుడిగా నారా లోకేష్ తెరపైకి వచ్చినప్పటి నుంచి నందమూరి హరికృష్ణ వంటి వారు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుపై ఎప్పటికి అప్పుడు నిప్పులు చెరుగుతుంటారు. తాజాగా, చంద్రబాబుతో ఇన్నాళ్లు పని చేసిన మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇదే మాట చెబుతున్నారు.
చదవండి: అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
మోత్కుపల్లి నోట లక్ష్మీపార్వతి మాట
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీని లాగేసుకున్నారని, ఆయనను పడదోసి పదవిని లాక్కున్నారని, చంద్రబాబు.. తర్వాత లోకేష్, పార్టీ వారి చేతుల్లోనే ఉండాలా అని గతంలో హరికృష్ణ, లక్ష్మీపార్వతిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడటమే సంచలనం అయితే ఇప్పుడు టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండే మోత్కుపల్లి వంటి నేత తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోటు నుంచి ఎన్టీఆర్ నుంచి కుర్చీ లాక్కోవడం వరకు అంటూ ఆయన కూడా విమర్శిస్తున్నారు.
హరికృష్ణ, లక్ష్మీపార్వతిల కంటే అడుగు ముందు
టీడీపీ విషయంలో చంద్రబాబుపై హరికృష్ణ, లక్ష్మీపార్వతి తదితర నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. మోత్కుపల్లి వారికంటే అడుగు ముందుకు వేశారు. అవసరమైతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో రథయాత్ర చేపడతానని చెప్పడం గమనార్హం. తెలంగాణ ప్రాంతానికి చెందిన మోత్కుపల్లి, ఏపీలో చంద్రబాబుకు ఓటు వేయవద్దని చెబుతూ ఏపీ అంశాలపై చంద్రబాబును దులిపేశారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారని, మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టారని, చివరకు బ్రాహ్మణులను కూడా విడదీస్తున్నారని, కాపులకు రిజర్వేషన్ ఇస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదాపై అనేకసార్లు యూటర్న్ తీసుకొని ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారన్నారు.
ఉదయం లక్ష్మీపార్వతి, ఆ తర్వాత మోత్కుపల్లి
ఇందులో భాగంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందే, లక్ష్మీపార్వతి ఉదయం ఎన్టీఆర్కు నివాళులు అర్పించి ఇదే డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆక్టోబస్ అని, ఇతరులను బతకనివ్వడని, టీడీపీని ఆయన లాక్కున్నారని, నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ తర్వాత మోత్కుపల్లి ఇదే అంశం మాట్లాడారు. పార్టీ పగ్గాలు వారికి అప్పగించాలన్నారు. పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని, నందమూరి కుటుంబం మొత్తం ఏకతాటిపైకి వచ్చి దీనిపై మాట్లాడాలని, నందమూరి కుటుంబం చేతికి వస్తే తాను కూడా ఏపీకి వచ్చి టీడీపీకి ప్రచారం చేస్తానన్నారు. బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలతో పాటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రదర్శించిన ఫ్లెక్సీ,నందమూరి కుటుంబానికి అప్పగించాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయి చర్యలు తీసుకుందని అంటున్నారు.
ఏళ్లుగా డిమాండ్
ఆరేళ్ల క్రితం చంద్రబాబు వారసుడిగా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు తెరపైకి వచ్చాయి. లోకేష్ పేరు తేలిపోవడంతో హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం తెలంగాణ టీడీపీ భేటీలో కొందరు కార్యకర్తలు చంద్రబాబు వద్ద ఓ విజ్ఞప్తి చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నందమూరి కుటుంబానికి బాధ్యతలు అప్పగించాలని గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు తెరపైకి వస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయంలో ప్రధానంగా ఇది వినిపిస్తుంది.
మోత్కుపల్లి విమర్శల వెనుక
ఇటీవలి వరకు మోత్కుపల్లి, చంద్రబాబు మధ్య బాగానే ఉంది. అంతకుముందు రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయినప్పటికీ చంద్రబాబుపై గౌరవంతో మౌనంగా ఉన్నారని అంటారు. ఇప్పుడు అదే రేవంత్ పార్టీని నిండా ముంచి కాంగ్రెస్లో చేరడం, తనకు హామీ ఇచ్చిన పదవులు నెరవేరేలా కనిపించకపోవడం, తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేకపోవడంతో వంటి కారణాలతో మోత్కుపల్లి ఇప్పుడు తీవ్ర విమర్శలు చేశారని అంటున్నారు. అయితే మోత్కుపల్లి విమర్శల వెనుక టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని, ఆయనకు నోటి దూల ఎక్కువ అని టిడిపి నేతలు అంటున్నారు. టీడీపీకి మోత్కుపల్లితో సంబంధం లేదన్నారు. తెరాసలో విలీనం చేయాలన్నప్పుడే ఆయనకు పార్టీతో సంబంధం తెగిపోయిందన్నారు.