అమరావతి ఊపిరి పీల్చుకో: ఈ ఏడాదికి రాజధాని తరలింపు లేనట్లే: ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన ఈ బిల్లులకు మండలిలో చెక్ పడింది. ఇక, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటం..ప్రభుత్వం అలా సాధ్యం కాదనటం.. మండలి చైర్మన్ ఆదేశాలు..శాసనసభా కార్యదర్శి తిరస్కరణ..కోర్టులో కేసుల తో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ముందడుగు వేయలేకపోయింది. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు విశాఖ..ఇటు అమరావతి ప్రాంత పరిధిలో విజయం సాధించి తమ నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉందనే భావన కలిగించాలని ప్రభుత్వంలో పెద్దలు వ్యూహాలు సిద్దం చేశారు. అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఆరు వారాల పాటు కొనసాగుతుందని ప్రకటించింది. అదే సమయంలో ఆ తరువాత సమీక్షించి ఎన్నికల నిర్వహణ కొనసాగింపు పైన నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో..ఈ ఎన్నికల ప్రక్రియ మే మాసంలో ముగిసే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా..అమరావతి నుండి రాజధాని తరలింపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రారంభం కాకుంటే..ఇక ఈ ఏడాది ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో..ఒక రకంగా ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చర్చ జరుగుతోంది.
రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున చర్చ
ఏపీలో మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధానికి విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోద ముద్ర వేసింది. అయితే, మండలిలో మాత్రం బిల్లుల ఆమోదానికి బ్రేక్ పడింది. ఆ బిల్లులను మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం వివాదాస్పద మైంది. ఇక, ఇదే అంశం ఇప్పుడు హైకోర్టులోనూ కొనసాగుతోంది. దీని పైన హైకోర్టు ఈ నెల 30న విచారణ కోసం వాయిదా వేసింది. ఇక, రాజకీయంగానూ అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదనదను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాల్లో ఏకపక్షంగా విజయం సాధించి తమ నిర్ణయానికి ప్రజామోదం ఉందని ప్రచారం చేసుకొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ద పడ్డారు.
రాజధాని తరలింపుకు మరో అడ్డంకి..
ఇప్పుడు ఆకస్మికంగా స్థానిక సంస్థల ఎన్నిక ల ప్రక్రియను కరోనా ఎఫెక్ట్ తో ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తరువాత సమీక్షించి ఎన్నికలు కొనసాగింపు పైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అప్పటి వరకు కోడ్ అమల్లో ఉంటుందని తేల్చేసింది. దీని ద్వారా కోడ్ దాదాపు మే చివరి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇది..ఇప్పుడు రాజధాని తరలింపుకు మరో అడ్డంకిగా కనిపిస్తోంది.
మే లో సాద్యపడకుంటే..అదీ వాయిదానే
ఇక ప్రభుత్వం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా..ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ద్వారా బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాలని నిర్ణయించింది. ఇక, అదే సమయంలో ఈనెల 30న కోర్టులో జరిగే వాదనలకు అనుగుణంగా రాజధాని తరలింపులో ముందడుగు వేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే విశాఖలో దీనికి అనుగుణంగా పరిపాలనా రాజధాని ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అయితే, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు కోడ్ అమల్లో ఉంటుందని చెప్పటం..ఆ తరువాత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయటానికి మరో పదిహేను రోజుల వరకు సమయం తీసుకొనే ఛాన్స్ ఉంది. ఇక, మే మాసం ముగిస్తే.. పరిపాలనా రాజధాని తరలింపు సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాదికి రాజధాని తరలింపునకు బ్రేక్
ఉద్యోగులు తమ పిల్లల చదువులు..జూన్ లో అకడమిక్ సంవత్సరం ప్రారంభం కావటం..వంటి కారణాలతో ఈ ఏడాదికి రాజధాని తరలింపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో కోర్టు వ్యవహారం ప్రధాన అంశంగా ఉంది. దీంతో..ప్రభుత్వం సైతం కొద్ది రోజులుగా వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ రాజధాని తరలింపు అంశం పైన పెద్దగా మాట్లాడటం లేదు. ఈ మొత్తం పరిణామాలను చూస్తూ ఈ ఏడాదికి రాజధాని తరలింపుకు బ్రేకులు పడినట్లేనని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వీటిని ఎదుర్కొని తమ నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను ఆలోచన చేస్తుందా...లేక నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటుందా అనేది మరో నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.