'వైఎస్ హయాంలో రామున్ని తలపించే పాలన.. మళ్లీ జగన్ వస్తేనే!..'
సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తర్వాత మళ్లీ అలాంటి పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని రోజా అన్నారు.
ఒంటిమిట్ట: శ్రీరామనవమి సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణానికి హాజరయ్యారు. స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా తమ పార్టీ అధినేత జగన్ను శ్రీరాముడితో పోల్చారు. త్వరలోనే ఏపీలో శ్రీరాముడి పాలన ప్రారంభమవుతుందని ఆకాంక్షించారు.
సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తర్వాత మళ్లీ అలాంటి పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని రోజా అన్నారు. ఇప్పుడు జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. త్వరలోనే అది సాకారమవుతుందన్నారు.
ఇక ఒంటిమిట్ట గురించి ప్రస్తావిస్తూ సౌకర్యాల లేమిపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఒంటిమిట్టను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భక్తులకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, నేటి శ్రీరామనవమిని పురస్కరించకుని ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు సీతారాముల దర్శనం కోసం వచ్చారు. ఇక్కడి ఆలయ ఆనవాయితీ ప్రకారం నిండు పున్నమి వెలుగుల్లో 10వ తేదీ రాత్రిపూట శ్రీరామ కళ్యాణం వైభవంగా జరగుతుంది.