కుప్పంపై టీడీపీ స్కానింగ్: చంద్రబాబు కొత్త సీటు వెదుక్కోక తప్పదా?: వైసీపీ కాన్ఫిడెంట్కు కారణాలివే
చిత్తూరు: రాష్ట్రంలో ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్రమంగా బలహీన పడుతోందనే సందేశాన్ని పంపించిదనడానికి వెనుకాడని పరిస్థితిని కల్పించినట్టయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఎదుర్కొన్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సహా అన్నింట్లోనూ పరాజయ పరాభావాన్ని ఎదుర్కొంది టీడీపీ. ఏ ఒక్క ఎన్నికలోనూ కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయిందనేది ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.
పంచాయతీల నుంచి నగరాల దాకా..
గ్రామ పంచాయతీ మొదలుకుని, మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ నిర్వహించిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. అధికారాన్ని కోల్పోయి రెండున్నరేళ్లయిన తరువాత కూడా టీడీపీ స్థానికంగా లేదా గ్రామస్థాయిలో ఏ మాత్రం కూడా పుంజుకోలేకపోయింది. పుంజుకోవడానికి గల అవకాశాలను కూడా వెదుక్కునేలా కనిపించట్లేదు ఆ పార్టీ వ్యవహార శైలిని చూస్తోంటే.
80 శాతానికి పైగా
సర్పంచ్ల నుంచి లోక్సభ సభ్యుల వరకూ అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ 80 శాతానికి పైగా ప్రాతినిథ్యాన్ని కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే.. అసెంబ్లీలో- 14 శాతం, లోక్సభలో 12 శాతం మాత్రమే టీడీపీకి ఉంది. పంచాయతీలు-19, మున్సిపాలిటీలు-1, ఎంపీటీసీ-14, జెడ్పీటీసీల్లో రెండుశాతం మాత్రమే తెలుగుదేఃశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు విజయాన్ని సాధించగలిగారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలవలేకపోయి ఉంటే మున్సిపాలిటీల్లో ఆ ఒక్క శాతం కూడా నమోదై ఉండేది కాదు.
టీడీపీ దుస్థితికి..
రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏ స్థితికి చేరుకుందనడాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చుకుంటే.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో సాధించిన ఓట్లు కొంత ఊరట కలిగించేవే. ఆ ఎన్నికలో టీడీపీకి మూడున్నర లక్షలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అవి ప్రతిఫలించలేదు. ఓట్లన్నీ ఓ సునామీలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తాయి. అంచనాలకు మించిన స్థాయిలో ఓటింగ్ శాతాన్ని సాధించింది వైఎస్సార్సీపీ.
కుప్పం పరిస్థితేంటీ?
మిగిలిన చోట్ల మాటెలా ఉన్నప్పటికీ- చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. పంచాయతీలనే కాదు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలనూ కోల్పోయింది. గ్రామస్థాయిలో టీడీపీ వైపు ప్రజలు లేరనడానికి ఈ ఎన్నికలు అద్దం పట్టినట్టయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించామని ఎంతగా చెబుతున్నప్పటికీ.. జనం నమ్మట్లేదు. ఓడిపోవడాన్ని కప్పి పుచ్చుకోవడానికి బహిష్కరణ కోణాన్ని తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.
కుప్పంపై వైసీపీ ఫుల్ కాన్ఫిడెంట్..
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మళ్లీ గెలిస్తే- తాను ఆయన బూట్లు తడుస్తానని, ఆయన కాళ్ల వద్ద కూర్చుంటానని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలిస్తే - తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. కుప్పం నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ పూర్తి పట్టును సాధించిందని, అందువల్లే కొడాలి నాని అంత కాన్ఫిడెంట్గా ఈ సవాల్ విసిరారని చెబుతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా..
తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారిగా కూడా ఈ స్థానంలో ఓడిపోలేదు టీడీపీ. 1983, 1985లో టీడీపీ తరఫున ఎన్ రంగస్వామి నాయుడు విజయం సాధించారు. ఆ తరువాత చంద్రబాబు హవా మొదలైంది. 1989 నుంచి చంద్రబాబు పాగా వేశారు. ఏడుసార్లు ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. తొలి రెండు రౌండ్లలో వెనుకబడినా.. ఆ తరువాత పుంజుకొన్నారు. 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. చంద్రబాబుకు రావాల్సిన మెజారిటీ అది కాదని, ఇంకా భారీగా ఉండాలనే అభిప్రాయాల్లో అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.
ఆ మూడు ఫ్యాక్టర్లతో..
కుప్పంలో పార్టీ బలహీనపడటానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకటి- జగన్ సర్కార్ పరిపాలన తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న యువతీ యువకులు వలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బ్యానర్లను కట్టారు. పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ ఉందక్కడ.
Recommended Video
కొత్త స్థానం తప్పదా?
చంద్రబాబు నాయకత్వంపై తమకు ఉన్న అసహనాన్ని, అసంతృప్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించడం ద్వారా ప్రదర్శించకున్నారనే వాదనలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కబెడితే గానీ టీడీపీ గెలవలేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబును కొత్త అసెంబ్లీ స్థానాన్ని వెదుక్కునేలా చేస్తోన్నాయని చెబుతున్నారు. ఈ సారి కుప్పంలో గెలవడానికి అనుకూల వాతావరణం ఉందని వైఎస్సార్సీపీ నాయకత్వంలో కాన్ఫిడెంట్ రావడానికి కారణాలు ఇవేనని అంటున్నారు.