చిరంజీవి-దాసరి స్నేహం, మారుతున్న ఈక్వేషన్స్: అసలేం జరుగుతోంది?
గత కొద్ది కాలంగా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఏపీ పరిణామాలు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.
విజయవాడ: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. చాలాకాలంగా సినిమా వేడుకలు కూడా రాజకీయపరంగా చూస్తున్నారు. గత కొద్ది కాలంగా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఏపీ పరిణామాలు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు. ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారుతున్నాయంటున్నారు.
నువ్వేనా :చిరంజీవిని సర్ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!
2014 ఎన్నికల సమయంలో బీజేపీ - టీడీపీ కూటమికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఇటీవల ఆయన ఆ పార్టీలకు ఎదురు తిరుగుతున్నారు. సమస్యల పైన నిలదీస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే టిడిపికి దగ్గరా లేదా దూరం కనిపించనప్పటికీ బీజేపీకి మాత్రం స్పష్టంగా దూరం జరిగినట్లుగా కనిపిస్తోంది.
అదే సమయంలో, ఆయన తెలుగుదేశం ప్రభుత్వం సమస్యల పైన నిలదీస్తున్నారు. దానికి చంద్రబాబు సహా మంత్రులు, టిడిపి నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం సమస్య పైన కూడా సానుకూలంగానే స్పందించడం, వెంటనే పవన్ థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగాయి. టిడిపిని పవన్ దూరం చేసుకోవడానికి ఇష్టం లేకపోవడమే... సానుకూల స్పందనకు కారణమనే వాదనలు ఉన్నాయి.
అసలేం జరుగుతోంది?
ఈ మార్పులు చాలాకాలంగా కనిపిస్తున్నాయి. తాజాగా మరిన్ని పరిణామాలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిరంజీవి, దాసరి నారాయణ రావుల కలయిక, కాపు ఉద్యమం, జగన్కు దాసరి మద్దతు, జగన్కు ఉండవల్లి అరుణ్ కుమార్ పరోక్ష మద్దతు అనే టిడిపి వాదనలు... చూస్తుంటే అసలు ఏపీలో రాజకీయంగా ఏదో జరుగుతోందని, అసలేం జరుగుతోందనే చర్చ సాగుతోంది.
దాసరి నారాయణ రావు ఇలా..
దాసరి నారాయణ రావుకు చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయనే వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. అయితే, గుంటూరు హాయ్ ల్యాండులో జరిగిన ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ వేడుకకు దాసరి హాజరవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా దాసరి.. చిరు పైన ప్రశంసల వర్షం కురిపించారు.
దాసరి-చిరుల మధ్య విభేదాలు లేవా?
అంతేకాదు, ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ ఇంటర్వ్యూలలోను చిరంజీవి మాట్లాడుతూ.. తనకు దాసరికి మధ్య ఎప్పుడు ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం గమనార్హం. గతంలో దాసరి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లను ప్రశంసించారు. చిరంజీవి పైన పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా పలుమార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ కనిపిస్తోంది.
ఆకాశానికెత్తారు
చిరంజీవి ఉన్న చోట జనసముద్రం ఉంటుందని, ఇలాంటి జనసముద్రాన్ని చూసి చాలా ఏళ్లయిందని, కృషి, పట్టుదలతో చిరంజీవి పైకి వచ్చాడని, ఎంతో కష్టపడి సూపర్ స్టార్, మెగాస్టార్ అయ్యాడని, ఇప్పటికీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్నారని, చిరుతో పోటీ పడితే రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా సరిపోరాని దాసరి ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ప్రశంసించారు. ఇండస్ట్రీలో కలెక్షన్స్తో షేక్ చేస్తున్న వారు కూడా చిరంజీవిలా డ్యాన్స్ చేయాలనుకుంటారని చెప్పారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఇంటర్వెల్ ముందుకు ఫైట్ ఇరగదీశాడని చెప్పారు. మొత్తానికి ఈ వేడుకలో దాసరి.. చిరు పైన ప్రశంసల వర్షం కురిపించారు.
ముద్రగడనే కలిపారా?
చిరంజీవి - దాసరిల మధ్య విభేదాల ప్రచారాన్ని పక్కన పెడితే.. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి వీరిద్దరు మద్దతు పలుకుతున్నారు. ఇక్కడే వీరి మధ్య విభేదాలు తొలగిపోయాయా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పైన పోరాడేందుకు ఇరువురు ఒక్కటయినట్లుగా కనిపిస్తోందని, అందుకే విభేదాలను పక్కన పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'తమ్ముడు'కు 'అన్నయ్య' సమర్థన
పవన్ కళ్యాణ్తో కలిసి పని చేసే అవకాశాలు లేవని, అలాగని పూర్తిగా కొట్టేయలేమని చిరంజీవి చెప్పారు. ఇరువురు దారులు వేరయినా లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. మరో విషయమేమంటే ప్రత్యేక హోదా, ఏపీలోని సమస్యల పైన పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న అంశాలను చిరంజీవి సమర్థిస్తున్నారనే చెప్పవచ్చు.
జగన్ నుంచి చిరువైపు దాసరి అడుగులు!
కొద్ది రోజుల క్రితం జగన్ - దాసరి సమావేశాలు, మోహన్ బాబు వ్యాఖ్యలు చూస్తే.. వైసిపితో దాసరి చెట్టాపట్టాలు వేసుకునే అవకాశాలున్నాయనే వాదనలు వినిపించాయి. దాసరి వైసిపిలో చేరుతారా అనే చర్చ కూడా సాగింది. దాసరి రాజ్యసభ స్థానాన్ని చిరంజీవితో భర్తీ చేశారని, అప్పుడే దాసరి ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.
జగన్ నుంచి కాంగ్రెస్ వైపు కాపు ఉద్యమం!
ఆ తర్వాత జగన్ ఆయనను కలవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన వైసిపిలో చేరినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపించాయి. మరో విషయమేమంటే.. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దాసరి వైసిపికి దగ్గరవుతున్నారనేందుకు అది కూడా నిదర్శనంగా భావించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరుకు దాసరి దగ్గరవుతుండటం గమనార్హం. తద్వారా దాసరి తిరిగి కాంగ్రెస్కు దగ్గరవుతున్నారని, కాపు ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటుందా అనే చర్చ కూడా సాగుతోంది.
కాంగ్రెస్ - వైసిపి కలిసేనా?
కాంగ్రెస్, వైసిపిలు ఎప్పటికైనా కలిసేవేనని టిడిపి నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు. కానీ వైసిపి మాత్రం దీనిపై భగ్గుమంటుంది. తాము ఎట్టి పరిస్తితుల్లో కాంగ్రెస్ పార్టీలో కలిసేది లేదని చెబుతుంది. కాంగ్రెస్ పార్టీకి జగన్ వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉందంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి... 'చిరంజీవి' కాంగ్రెస్ వైపు వెళ్తున్నారా, లేక వైసిపి - కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతాయా అనే చర్చ సాగుతోంది.