మాకే తగిలింది: జగన్ తీరుపై సొంత పార్టీలో అసంతృప్తి!, ఆంధ్రజ్యోతిపై ఎలా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తీరుపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: తప్పులో కాలేసిన జగన్, తప్పు చేస్తున్నారా?
ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని హడావుడిగా చెప్పడం ఏమిటి, ఇప్పుడు రాజీనామాలు చిన్న విషయమని, ఇప్పుడు కాకుంటే ఆర్నెళ్ల తర్వాత చేస్తామని వ్యాఖ్యలు చేయడం ఏమిటని జగన్ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది.
జగన్ సెల్ఫ్ గోల్
ప్రధాని నరేంద్ర మోడీని కలవడం వరకు ఓకే అని, కానీ ఆ తర్వాత రాజీనామాలపై హఠాత్తుగా యూ టర్న్ తీసుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. అసలు అంతకుముందు రాజీనామాలు చేస్తామని ప్రకటించడమే సరికాదని భావిస్తున్నారని తెలుస్తోంది.
మాది మాకే తగిలిందని..
ప్రత్యేక హోదా విషయంలో నిన్నటి దాకా గట్టిగా పోరాడమని, విపక్షాలు కూడా తమను సమర్థించాయని, ఇప్పుడు జగన్ వ్యాఖ్యలతో విపక్షాలు సహా అందరి దృష్టిలో మేం దోషులుగా అయిపోయామని వైసిపి నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. హోదాపై చంద్రబాబును నిన్నటి దాకా గట్టిగా నిలదీశామని, ఇప్పుడు ఆ ఆయుధం మనకే వచ్చి తగిలిందని గుసగుసలాడుకుంటున్నారంటున్నారు.
ఆంధ్రజ్యోతి కథనంపై..
ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై కూడా వైసిపిలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ప్రధాని మోడీని ఫిబ్రవరిలో కలిసినా లేదా మేలో కలిసినా.. ఎప్పుడు కలిసినా కేసుల గురించి జగన్ ప్రస్తావించడం ఇరుకున పడేసినట్లేనని వైసిపి నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అప్పటి లేఖను ఇప్పటిదిలా ప్రచురించడం వరకు ఆ పత్రికది తప్పేనని, కానీ మోడీ ఎదుట కేసు గురించి జగన్ చెప్పారనే అంశం మాత్రం చులకన చేసిందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయని అంటున్నారు.దీనిని ఎలా సమర్ధించుకోవాలో తెలియక వైసిపి నాయకులు తలలు పట్టుకున్నారని అంటున్నారు. జగన్ తీరుపై పలువురు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
జగన్ కూడా
ప్రత్యేక హోదా అంశంపై టిడిపితో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా జగన్ను విమర్శించాయి. ఈడీ, సీబీఐ కేసుల భయంతోనే మోదీ వద్దకు జగన్ కాళ్లబేరానికి వెళ్లారని నేరుగా విమర్శలు చేశాయి. అయితే ప్రతిపక్షనేతగా రాష్ట్ర సమస్యలను మాత్రమే ప్రధాని వద్దకు తీసుకెళ్లానని వైసీపీ నేతలు మీడియాకు విడుదల చేసిన నోట్ను చూపించి వాదిస్తూ వస్తున్నారు. అది ఎప్పుడు జరిగినా మోడీ వద్దకు కేసుల అంశాన్ని జగన్ తీసుకెళ్లాడని తేలిందని అంటున్నారు. తాను గతంలో ఇచ్చిన లేఖను ఇప్పుడు చూపించారని జగన్ కూడా అన్నారు.