ఉద్యోగినులకు స్వీట్లు ఇచ్చిన రైతు నేతలు, రెయిన్ ట్రీ పార్క్లో డిన్నర్
అమరావతి: ఏపీ చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమైంది. సోమవారం నాడు దాదాపు పూర్తిస్థాయిలో ఉద్యోగులు సొంత గడ్డకు చేరుకున్నారు. సచివాలయ ఉద్యోగులు తరలి వచ్చారు. ఏపీ నుంచి పరిపాలన ప్రారంభమైంది. తొలి రోజు విధులకు 1800 మంది సిబ్బంది హాజరయ్యారు.
నాలుగు శాఖలు మినహా అన్ని శాఖలు వచ్చాయి. రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉద్యోగులు వచ్చారు. వారికి అప్పటికే అక్కడున్న వారు మిఠాయిలు పంచి ఘన స్వాగతం పలికారు. ఉద్యోగ సంఘాల నేతలు విందు ఏర్పాటు చేశారు. వెలగపూడి సచివాలయ సౌకర్యాల పైన అందరూ ఆనందం వ్యక్తం చేశారు. దసరా తర్వాత పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తారు.
అక్టోబరు 3 నుంచి అమరావతి కేంద్రంగానే పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిపాలన జరగాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులకు సచివాలయ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మురళీకృష్ణ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు.
ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొందరు రైతు నాయకులు.. మహిళా ఉద్యోగినులకు మిఠాయిలు పంచారు. పంచాయతీరాజ్, విద్య, అటవీ, హోం, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది మాత్రమే రాలేదు. వారు ఈ నెల 13న విధుల్లో చేరనున్నారు.
మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే సోమవారం సచివాలయానికి వచ్చారు. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధికారుల్లో కొందరే విధులకు హాజరయ్యారు. కొందరు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సహా నేరుగా లగేజితో వచ్చారు.
చాలామంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో కూర్చుని, హాజరు పట్టికల్లో సంతకాలు చేసి మధ్యాహ్న భోజనం అనంతరం బస ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కొందరు ఉద్యోగులు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి వారిని గుంటూరు ఆర్టీసీ అధికారులు 20కి పైగా ప్రత్యేక బస్సుల్లో వెలగపూడి తరలించారు. వచ్చిన ఉద్యోగుల్లో ఇప్పటికే సగం మంది నివాస వసతి చూసుకున్నారు. కొందరు బంధువుల ఇళ్లల్లో, మరికొందరు హోటళ్లలో దిగారు. సుమారు 200 మంది మహిళా ఉద్యోగినులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో ప్రభుత్వం ఉచితంగా హాస్టల్ వసతి కల్పించింది.