బీజేపీ కొత్త పాఠాలు: జగన్ కుటుంబం నేరస్వభావం అంటూ ఫ్యామిలీని లాగిన యనమల
అమరావతి: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాట్లు పడుతోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, వైసీపీ ప్రీ ప్లాన్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. దర్యాఫ్తు ముందుకు సాగకుండా ఉండేందుకు కొత్త డ్రామాకు తెరదీశారన్నారు.
జగన్పై హత్యా ప్రయత్నం, బాబు వైపు వేలు: కీలక పాయింట్లు లాగిన వైవీ సుబ్బారెడ్డి
జగన్ కుటుంబ నేర స్వభావం జగద్విదితం అన్నారు. జగన్ తాత రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని చెప్పారు. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి మృతి పైన కూడా ఇలాగే అనుమానాలు, అపోహలు సృష్టించారని చెప్పారు. పెట్రోల్ బంకులపై దాడులు చేసి విధ్వంసం సృష్టంచారన్నారు.
కుట్రలు, నేరాల్లో వైసీపీకి బీజేపీ కొత్త పాఠాలు
హింస, విధ్వంసాలకు ప్రతిబింబం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని యనమల ఆరోపించారు. నేరాలు చేయడంలో ఆరితేరిన దిట్ట, కుట్రలు చేయడంలో అందెవేసిన చేయి అన్నారు. కుట్రలు, నేరాల్లో వైసీపీకి బీజేపీ కొత్త పాఠాలు నేర్పిస్తోందని ఎద్దేవా చేశారు. నేరాలు, కుట్రలలో బీజేపీ, వైసీపీ పోటీ పడుతున్నాయన్నారు.
మాయావతిని కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
జాతీయస్థాయిలో ఒకే భావజాలం ఉన్న పార్టీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకం చేస్తున్నారని యనమల చెప్పారు. బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో చంద్రబాబు భేటీ కావడాన్ని బీజేపీ, వైసీపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.
ఫ్యామిలీని లాగుతున్న టీడీపీ నేతలు
అంతకుముందు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఈ హత్యాయత్నంలోకి జగన్ కుటుంబాన్ని లాగారు. షర్మిల, విజయమ్మల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు యనమల జగన్ కుటుంబానిది నేరస్వభావం అని మరోసారి ఫ్యామిలీని లాగారు.
ఆపరేషన్ గరుడపై విచారణ చేపట్టాలి
మరోవైపు, ఆపరేషన్ గరుడపై విచారణ చేపట్టాలని, నటుడు శివాజీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఏపీ బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల వేరుగా డిమాండ్ చేశారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య పెరిగిందని, అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ, వైయస్ జగన్పై దాడులు జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ పై దాడి డ్రామా అని ఏపీ డీజీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, గవర్నర్ ఆరా తీస్తే టీడీపీ నేతలు ఎదురుదాడి చేయడం సరికాదని, జగన్ పై దాడి కేసు కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.