హోదా ఫైట్: కాంగ్రెస్ ప్రత్యేక హోదా తీర్మానంతో జగన్ ఇరుకున పడ్డారా..?
ఏపీకి అన్యాయం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ ముగిసింది. అలవోకగా మోడీ సర్కార్ ఇందులో నెగ్గింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇష్టపడని ప్రధాని మోడీ ఆ నెపం ఎంచక్కా 14వ ఆర్థిక సంఘంపై నెట్టేసి తనమీద ఉన్న భారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పటికే జగన్ విసిరిన ఉచ్చులో టీడీపీ పడిందంటూ పార్లమెంటు సాక్షిగా ప్రధాని చెప్పారు.
Recommended Video
ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదని తేలిపోయింది. అదే సమయంలో ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే తమ మద్దతు అంటూ పలుమార్లు జగన్ బాహాటంగానే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యేక హోదాను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసింది. అందులో ఒకటి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం.ఇది ఒక రకంగా జగన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా...?
ప్రత్యేక హోదా
ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పుడు రాజకీయంగా వినిపిస్తున్న ఒకే ఒక పదం ప్రత్యేక హోదా. అదే నినాదంపైనే అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నాయి. మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యం అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఇక అధికార టీడీపీ ప్రభుత్వం మూడేళ్లు ఎన్డీఏ సర్కార్లో ఉండి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా బెటర్గా ఉందంటూ నాడు సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం రాష్ట్రంలో మారుతున్న రాజకీయపరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుంది. ఇక అప్పటి వరకు హోదా రేసులో కనిపించని కాంగ్రెస్ నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకంగా తీర్మానమే పెట్టింది. కాంగ్రెస్ నిర్ణయంతో ఇప్పుడు నష్టం ఎవరికి లాభం ఎవరికి అన్నదానిపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
జగన్
హోదా ఎవరైతే ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హోదా ఇచ్చేది లేదని అధికారంలో ఉన్న బీజేపీ తేల్చేసింది. ఇక అధికారంలో లేని కాంగ్రెస్ అధికారం చేపట్టగానే హోదా ఇస్తామంటోంది. మరి జగన్ కాంగ్రెస్తో వెళతాడా..? తనను తన కుటుంబాన్ని అంతగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్కు జగన్ మద్దతు తెలుపుతాడా..? ఇప్పటికే జగన్ టార్గెట్గా ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ టీడీపీల కామన్ టార్గెట్ జగన్. ఏపీలో టీడీపీ కాంగ్రెస్లో ఒక అవగాహనతో పోటీచేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్
ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చినా ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్న జగన్... కాంగ్రెస్ హోదా ఇస్తామని చెబుతోంది కాబట్టి ఆ పార్టీకి ఎన్నికల కంటే ముందే ఒక అవగాహనకొస్తారా... ఇలా వస్తే వైసీపీకి లాభం చేకూరుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇంతకాలం తన పోరు మొత్తం కాంగ్రెస్ పైనే చేసిన జగన్... ఉన్న ఫలంగా హోదా ఇస్తామంటే కాంగ్రెస్కు మద్దతు ఇస్తాడా అనేది మరో కోణం. కాంగ్రెస్ ఎత్తుగడతో వైసీపీకి కొంత నష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ తీసుకున్న హోదా నిర్ణయం కేవలం ఏపీలో ఓట్లు చీల్చేందుకే అన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
కాంగ్రెస్ వైసీపీ ఓటు బ్యాంకు ఒకటే కావడంతో ఇప్పుడు హస్తం పార్టీ తీసుకున్న నిర్ణయంతో జగన్ జంక్షన్లో ఇరుక్కున్నట్లయ్యింది. కాంగ్రెస్ హోదా తీర్మానంతో ఓట్లు చీలితే అది టీడీపీకి ప్లస్ అవుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. టీడీపీతో జనసేన ఉన్నంతకాలం పసుపు పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ వెళ్లిపోవడంతో కాస్త బలహీన పడిన టీడీపీ... కాంగ్రెస్ ప్రకటనతో ఓట్లు చీలడం ఖాయం అది తమకు లాభిస్తుందన్న భావనలో ఉంది. .అధికారంలోకి రాగానే హోదా తప్పకుండా ఇస్తామని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళితే జగన్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. దీనికి జగన్ సమాధానం ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తారా... లేక పంతానికి పోయి మరే నిర్ణయమైనా తీసుకుంటారా అన్నది చాలా ఇంట్రస్టింగ్గా మారింది.