అసెంబ్లీలో వల్లభనేని వంశీ: ఎక్కడ కూర్చున్నారంటే: ఏం చేయబోతున్నారు..!
టీడీపీ ఎమ్మెల్యేగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి..వైసీపీకి దగ్గరైన గన్నవర్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి లోకేశ్ మీద తీవ్ర విమర్శలు చేసారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే..వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. దీంతో..వంశీని టీడీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని పైన కొద్ది రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని సైతం స్పందించారు. టీడీపీ వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు సమాచారం ఇస్తే..ప్రత్యేకంగా స్వతంత్ర అభ్యర్ధి తరహాలో వంశీకి సీటు కేటాయిస్తామని స్పష్టం చేసారు. అయితే, ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు వంశీ హాజరయ్యారు. ఇంతకీ ఆయన ఎక్కడ కూర్చున్నారు..ఏం చేయబోతున్నారు..
అసెంబ్లీకి హాజరైన వంశీ...
టీడీపీ నుండి గెలిచి..వైసీపీకి ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు మద్దుతుగా నిలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీకి హాజరయ్యారు. అక్టోబర్ 25న ముఖ్యమంత్రిని కలిసిన తరువాత వంశీ కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. ఇక, చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్ష చేసిన రోజున మీడియా ముందుకు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. తాను టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా..ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు నచ్చి ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసారు. అవసరమైన సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు. ఇక ఈ రోజు నుండి ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజునే వంశీ సభకు హాజరయ్యారు.
టీడీపీ బెంచ్ ల్లోనే...
ఇక, వంశీ అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారనే దాని పైనా చర్చ సాగింది. కానీ వంశీ ఇంకా అసెంబ్లీ రికార్డుల ప్రకారం టీడీపీ సభ్యుడిగానే ఉన్నారు. దీంతో..వంశీ గతంలో లాగానే టీడీపీ బెంచ్ ల్లో వెనుక వైపు కూర్చున్నారు. టీడీపీ తమ పార్టీ నుంబి వంశీని సస్పెండ్ చేసినట్లు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత మాత్రమే అసెంబ్లీ కార్యదర్శి వంశీకి ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీడీపీ బెంచ్ ల నుండే వంశీ ప్రభుత్వానికి మద్దతుగా తన వాయిస్ వినిపించటానికి వ్యూహం సిద్దం చేసినట్లు కనిపిస్తోంది. అయితే, సభ్యుడిగా వంశీ తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుందని..విప్ ఇచ్చిన సందర్భంలోనే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా సభలో వ్యవహరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అవసరమైన చర్చల్లో..ఇలా
కీలక చర్చల్లో వంశీని టీడీపీ నుండి తమకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇంగ్లీషు మీడియం పాఠశాలలు..ఇసుక అంశం.. కేసీఆర్ తో సంబంధాల పైన చర్చ సమయంలో వంశీ జోక్యం చేసుకొనే అవకాశం ఉందని సమాచారం. ఆ సమయంలో టీడీపీ వాదనకు భిన్నంగా చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా వంశీ మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో..ఈ అంశాల మీద చర్చకు వచ్చిన సమయంలో వంశీ ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే, ఈ రోజు సమావేశాలు ప్రారంభం కావటంతో.. టీడీపీ ఇప్పుడు వంశీ మీద తాము సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ కు నివేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..మొత్తంగా వంశీ కేంద్రంగా అసెంబ్లీ లాబాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి కర చర్చ సాగుతోంది.