సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుకు ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా, నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఎస్ఈసీ ఆదేశాలు పాటించాలా లేక ప్రభుత్వ ఆదేశాలు పాటించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ చకచకా పావులు కదుపుతున్నారు. అలాగే ఉద్యోగుల సహకారం లేకపోవడంపై కేంద్రాన్ని కూడా ఆశ్రయించారు.
Recommended Video
సుప్రీంతీర్పుతో నిమ్మగడ్డ చకచకా
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చకచకా పావులు కదుపుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశించిన నిమ్మగడ్డ.. సరిగ్గా ఊహించిన ఫలితమే రావడంతో అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న మార్పులను అమల్లోకి తెస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మారిపోయింది. అదే సమయంలో ఉద్యోగులపైనా ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడమే కాకుండా కేంద్ర సిబ్బంది సాయం కోరారు.
మారిన ఎన్నికల షెడ్యూల్
ఏపీలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ఇవాళ తొలి దశ నామినేషన్లు ప్రారంభం కావాల్సి ఉండగా.. అలా జరగలేదు. దీంతో ఎలాగో ఆలస్యమైంది కాబట్టి నోటిఫికేషన్లో కీలక మార్పులు చేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం గత నోటిఫికేషన్లో నాలుగు విడతలో జరగాల్సిన ఎన్నికలు తొలి విడతకు మారాయి. అప్పట్లో మూడో దశలో ప్రకటించిన గ్రామ పంచాయతీలకు రెండో దశలోనూ, రెండో విడగగా ప్రకటించిన వాటికి తొలి దశలోనూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మారిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీ మార్పులు చేసింది. మొదటి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి. మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు
కేంద్రం సాయం కోరిన నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల నుంచి తనకు సహకారం ఉండబోదని అంచనా వేస్తున్న నిమ్మగడ్డ రమేష్.. కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఆయన కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు వీలుగా కేంద్రం తమ ఉద్యోగులను కేటాయించాలని నిమ్మగడ్డ కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తి రేపుతోంది.
ఏపీ ఉద్యోగుల్ని నమ్మడం లేదా ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు తనకు సహకరించబోరని నిమ్మగడ్డ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రంలో సిబ్బందిని కేటాయించాలని ఆయన కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా కేంద్ర ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అది కూడా చర్చనీయాంశంగా మారే అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ మద్దతున్న రాష్ట్ర ఉద్యోగులు తనకు ఇబ్బందులు సృష్టిస్తారని ఎస్ఈసీ నిమ్మగడ్డ భావించడమే దీనికి కారణం.