మొండితనమా, సానుభూతి కోసమా ? వరుస ఎదురుదెబ్బలతో తీరు మార్చుకోని జగన్ సర్కార్...
అధికారంలో ఉన్న వారి కంటే లేని వారే సౌకర్యంగా ఉంటారనేది మన దేశ రాజకీయాల్లో నానుడి. ఓసారి ప్రజలు అధికారం కట్టబెట్టాక ఇక అన్నింటినీ గౌరవించాల్సిందే. ఓటేసిన ప్రజలు, రాజ్యాంగ వ్యవస్ధలు, అధికార యంత్రాంగం, న్యాయస్ధానాలు.. ఇలా ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు, బాధ్యతలను ప్రభుత్వాలు గౌరవించాల్సిందే. ఇందులో ఏ ఒక్క అంశంలో తొందరపాటు ప్రదర్శించినా మొట్టికాయలు తప్పవు. చివరికి తప్పు తెలుసుకునే సరికి ప్రజల్లో చులకన కావడం ఖాయం. ఇప్పుడు సరిగ్గా ఏపీలోనూ అదే జరుగుతోంది. భారీ మెజారిటీతో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని వాడుకుంటూ దూకుడుగా వెళ్లే క్రమంలో జగన్ సర్కారు కీలకమైన లౌక్యాన్ని మర్చిపోతుందనే వాదన పెరుగుతోంది.
జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...
వరుస ఎదురుదెబ్బలతో...
గతేడాది మే 30న అధికారం చేపట్టిన తర్వాత నుంచీ జగన్ సర్కారుకు ఎన్నో విషయాల్లో ఎదురుదెబ్బలు తప్పలేదు. ముఖ్యంగా జగన్ కు పాలన చేతకాదని నిరూపించడానికి కంకణం కట్టుకున్న విపక్షాలు ఎక్కడ తప్పు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోగానే దాని మంచి చెడులతో సంబంధం లేకుండా కోర్టుల తలుపు తడుతున్నాయి. అంతిమంగా అధికార, విపక్షాల పోరు కాస్తా ప్రభుత్వం వర్సెస్ హైకోర్టుగా ప్రజలు భావించే పరిస్దితి వచ్చేస్తోంది. ఓ దశలో హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి తాము వ్యతిరేకమనే సంకేతాలు వెళ్తున్నాయని కోర్టు హాల్లోనే స్పష్టం చేశారు. ఈ ఒక్క మాట చాలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చెప్పడానికి.
కొరవడిన లౌక్యం.. అన్నింటా మొండితనం..
అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుపోవాలనే లౌక్యం సీఎం జగన్ తన తండ్రి, మాజీ సీఎం వైఎస్సార్ నుంచే అలవరుచుకోవాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో అత్యంత స్వేచ్ఛగా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఏకతాటిపైకి తెచ్చిన ఘనత వైఎస్సార్ ది. అలాగే ప్రభుత్వ పాలనలోనూ వైఎస్ హయాంలో అధికార, రాజ్యాంగ వ్యవస్ధలను ఆయన గౌరవించిన పద్ధతి కూడా జగన్ కు ఎప్పటికీ నేర్చుకోదగిన పాఠమే. అన్నింటికన్నా ముఖ్యం లౌక్యం. రాజనీతి అంటేనే లౌక్యం. లౌక్యం లేని రాజనీతిని ఊహించలేం. కానీ రాజకీయాల్లో ఉంటూ లౌక్యం ప్రదర్శించాల్సిన చోట మొండిగా ముందుకెళ్లడం ద్వారా జగన్ ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్దితి తెచ్చుకుంటున్నారు. మొండిగా వ్యవహరిస్తూ పదేపదే వ్యవస్ధలపై నేరుగా విరుచుకుపడుతున్నారు. అంతిమంగా వ్యవస్ధలకు తాను వ్యతిరేకమంటూ జనంలో, వ్యవస్ధలే తమకు వ్యతిరేకమంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేస్తున్నారు.
అయితే అలా.. లేకుంటే ఇలా....
కీలకమైన అంశాల్లో దూకుడుగా ముందుకెళ్లడం ద్వారా ఏదో విధంగా ప్రయోజనం ఉంటుందనే అంచనాతో సీఎం జగన్ ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దూకుడుతో ముందుకెళ్లి విజయం సాధిస్తే ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుందని, అలా కుదరక ఎదురు దెబ్బలు తిన్నా ప్రజల్లో సానుభూతి వస్తుందనే అంచనాతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున చర్చ జరిగిన వైసీపీ రంగులు, నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాల్లో ప్రభుత్వ శైలిని గమనిస్తే ఇదే అర్ధమవుతుంది. కానీ ఈ రెండు కీలక అంశాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పలేదు. అలాగని సానుభూతి వచ్చిందా అంటే అదీ లేదు. ఇదే కోవలో ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ముందుకెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలినా అంతిమంగా ప్రభుత్వం ఓ మంచి పని చేయాలంటే ఇలా జరిగిందంటూ బడుగు వర్గాల్లో సానుభూతి వస్తుందని జగన్ ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే కోవలో మూడు రాజధానుల ఏర్పాటు కూడా. రాజధానుల వ్యవహారంలో కోర్టుల్లో ఎదురుదెబ్బ తలిగినా మూడు ప్రాంతాల్లో సానుభూతి లభిస్తుందనే అంచనాతో జగన్ ఉన్నట్లు అర్ధమవుతోంది.
Recommended Video
ప్రజల్లో చులకన.. కిం కర్తవ్యం ?
కీలక అంశాల్లో జగన్ సర్కార్ ప్రదర్శిస్తున్న దూకుడుతో అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా వరుస ఎదురుదెబ్బలతో ప్రజల్లో చులకన అవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలనపై అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయని మధ్యతరగతి ఓటర్లలో సైతం అభిప్రాయం వ్యక్తమవుతుండటం ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బే అవుతుంది. ఎన్నో ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలను, అంతెందుకు తన తండ్రి వైఎస్సార్ ను కూడా చూసిన అధికారులు, బ్యూరోక్రాట్లు ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారికి స్వేచ్ఛనివ్వడం ద్వారా ప్రభుత్వ విధానాల నిర్ణయంలో ముందుచూపుతో వ్యవహరించే పరిస్ధితులు కల్పించాలని వారు కూడా కోరుకుంటున్నారు. అలా కాకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మొండితనం ప్రదర్శిస్తే అసలుకే మోసం వస్తుందన్న అంశాన్ని జగన్ గుర్తించాలని అధికార యంత్రాంగం కూడా కోరుకుంటోంది.