2019 ఎన్నికలకు ముందు ఎన్డీయేకే పెద్ద దెబ్బ: చంద్రబాబు ఎఫెక్ట్, మోడీకి ఎసరు?
న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: నిన్న శివసేన, నేడు ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ వ్యవహారం నేపథ్యంలో ఎన్డీయోలో లుకలుకలు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షాకు పెద్ద సవాల్ అని అంటున్నారు.
'పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నలు వేయొచ్చు, సిద్ధం'
అందుకు పలు రాజకీయ కారణాలతో పాటు మిత్రపక్షాల అసంతృప్తి, వాటిపై పొత్తులు, ఎత్తులు కూడా ఓ కారణంగా చెబుతున్నారు. పదేళ్ల పాటు యూపీఏ అధికారంలో ఉండటం, గుజరాత్ నమూనా కారణంగా 2014లో బీజేపీ సులభంగా గెలిచిందని గుర్తు చేస్తున్నారు. కానీ మోడీపై పెట్టుకున్న ఆశలు సంతృప్తికరంగా లేకుంటే అదే జనాలు తిప్పికొడతారని అంటున్నారు.
గుజరాత్ దెబ్బ
2014 తర్వాత బీజేపీ దూకుడు పెరిగింది. మోడీ ప్రధాని అయ్యాక ఏకంగా మిత్రపక్షాలతో కలిపి బీజేపీ పాలిత రాష్ట్రాలు 19కి చేరుకుంది. ఇటీవల మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాత్రం కొంత ఎదురుదెబ్బ తగిలింది. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ పాలన, మోడీ ప్రధానిగా వెళ్లడం, వ్యతిరేక వర్గాలు అన్నీ జట్టుకట్టడం అనేది రాజకీయాల్లో సహజమే. ఈ లెక్కలు పక్కన పెడితే గుజరాత్లో బీజేపీ చచ్చీ చెడి గెలిచింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలు బీజేపీకి అంత సులభం కాదని అంటున్నారు.
ఈ కారణాలతో కఠిన పరీక్షే
అంతకుముందు, జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా సామాన్యుల్లో కొంతమంది ఆగ్రహంతో ఉన్నారు. వీటికి విపక్షాలు ఆజ్యం పోస్తున్నాయని అంటున్నారు. గురువారం అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కూడా ప్రజారంజకంగా కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయ రంగానికి, యువతకు ఊతమిచ్చేలా మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. భావి భారత్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని చెప్పినప్పటికీ ఓట్ల విషయానికి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు ఏం జరిగిందనే ఉద్దేశ్యంతోనే ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి కఠిన పరీక్షే అంటున్నారు.
శివసేన నుంచి చంద్రబాబు దాకా
ఈ కఠిన పరీక్షలకు తోడు ఆయా రాష్ట్రాలలో పాతుకుపోయేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మిత్రపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్న శివసేన, నేడు ఏపీలో చంద్రబాబు వ్యవహారంతో ఎన్డీయేలో రానున్న రోజుల్లో లుకలుకలు కొట్టిపారేయలేమని అంటున్నారు.
వీటిని చూపించి అసంతృప్తి
ఇప్పటికే అంతర్గతంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇదేనా అని పలు పార్టీలు బీజేపీని నిలదీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శివసేను, నవ్యాంధ్రను చూపించి పలు మిత్రపక్షాలు అసంతృప్తికి లోనవుతున్నాయని అంటున్నారు.
మాకు తగలవచ్చునని
మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకొని ఇటీవలి కాలంలో ఎదిగిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది. శివసేనతో దోస్తీతో గెలిచింది. బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మరోవైపు ఏపీలో ప్రత్యేక హోదాకు బదులు ఇస్తామన్న ప్యాకేజీ, విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు. వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని అంటున్నారు. పైగా ఏపీలో తాము ఎదగాలంటే టీడీపీని పక్కన పెట్టాలని స్థానిక బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ దిశలోను అధిష్టానం ఆలోచన చేస్తోంది. బీజేపీ దూరమైతే టిడిపి పవన్ కళ్యాణ్పై ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు కలిసి ఉండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఆశించిన మేర చేయకుండా ఇప్పుడు విడిపోతామని చెప్పడం ఏమిటని టీడీపీ వాపోతోంది. ఇదే విషయం ఇతర మిత్రపక్షాలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. నిన్న శివసేనకు, నేడు టీడీపీకి తగిలిన దెబ్బ తమకు తలగదనే గ్యారెంటీ లేదని భావిస్తున్నారట.
Recommended Video
చంద్రబాబు దెబ్బ, మోడీకి షాక్ తగిలేనా
ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పెద్ద పార్టీల్లో టీడీపీ, శివసేన, శిరోమణి అకాలీదళ్, పీడీపీలు ఉన్నాయి. మరిన్ని చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాలతోను అక్కడి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీహార్లో జేడీయూకు దూరమై మళ్లీ దగ్గరయింది. తమిళనాట కూడా అన్నాడీఎంకే గ్రూపులను అడ్డు పెట్టుకొని బీజేపీ ఎదగాలని భావించింది. ఈ విషయంలో అన్నాడీఎంకే వర్గాలు కూడా పునరాలోచన చేస్తున్నాయట. శివసేన తర్వాత చంద్రబాబుతో పొత్తు వ్యవహారం బెడిసి కొడితే బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కొట్టి పారేయలేమని, ఎన్డీయేలో లుకలుకలు కనిపించవచ్చునని అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కూడా దగ్గర... దూరం పాటిస్తున్నారు.