ఏపీ అవతరణ దినోత్సవం కొత్త తేదీ ఖరారు- చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ చెక్..
ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎప్పుడూ గందరగోళమే. గతంలో ఆంధ్రరాష్ట్రం అవతరించిన తేదీ ఒకటి కావడం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తేదీ మరొకటి కావడం, అనంతరం విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటు తేదీ ఇంకొకటి కావడమే ఇందుకు కారణం. ఇందులో దేన్ని ఎంచుకోవాలనే దానిపై గతంలో తర్జనభర్జన పడిన టీడీపీ సర్కారు చివరికి తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్ 2నే అవతరణ వేడుకలకు బదులు నవనిర్మాణం పేరుతో కార్యక్రమాలు నిర్వహించేది.
కానీ దీన్ని అప్పట్లో వ్యతిరేకించిన వైసీపీ ఆంధ్రప్రదేస్ ఏర్పడిన నవంబర్ 1నే ఈ వేడుకలు జరపాలని డిమాండ్ చేసేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత నవంబర్ 1న వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర అవతరణ గందరగోళం...
ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో పార్టీలకు ఓ స్పష్టమైన విధానం లేదు. టీడీపీ ఒకటి చెప్పింది కాబట్టి మరొకటి చేయాలని వైసీపీ, వైసీపీ చెప్పింది తాము వినాలా అని టీడీపీ ప్రభుత్వాలు భావించాయి, భావిస్తున్నాయి. దీంతో రాష్ట్ర అవతరణ వేడుకల విషయంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లకూ అదే గందరగోళం. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్టంలో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన నవంబర్ 1నే రాష్ట అవతరణ దినోత్సవంగా నిర్వహించేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇరువురూ జూన్ 2నే అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తుండగా.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నవనిర్మాణ దీక్షలు చేపట్టేది. కానీ అప్పట్లో వైసీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించేది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఏకాభిప్రాయం కుదరలేదు.
మరోసారి నవంబర్ 1 ఖరారు...
గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ తాము అధికారంలోకి రాగానే తిరిగి నవంబర్ 1న నిర్వహిస్తామని ప్రకటించింది. చివరికి తీవ్ర తర్జన భర్జనల మధ్య గతంలో తాము వినిపించిన పాత డిమాండ్ నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా గుర్తిస్తూ వైసీపీ సర్కార్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో నవంబర్ 1న రాష్ట్ర, జిల్లా స్దాయిల్లో ఈ వేడుకలు నిర్వహించేందుకు 9 మంది సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై వైసీపీ సర్కారు నిర్ణయం ప్రకారం నవంబర్ 1న వేడుకలు జరగబోతున్నాయి.
ఆరేళ్ల విరామం తర్వాత ...
గతంలో చివరి సారిగా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలను ఉమ్మడి ఏపీలో అప్పటి కిరణ్ కుమార్రెడ్డి సర్కారు 2013లో నిర్వహించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన కారణాలతో 2014 నుంచి 2018 వరకూ నవంబర్ 1న ఈ వేడుకలు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో జూన్ 2న అవతరణ దినంగా ప్రకటించినా వేడుకలు మాత్రం లేవు. నవనిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు జరిగేవి. టీడీపీ స్ధానంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా గతేడాది నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలు జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో గందరగోళమే ఇందుకు కారణం. చివరికి ఆరేళ్ల విరామం తర్వాత ఈ వేడుకలను నవంబర్ 1నే నిర్వహించాలని నిర్ణయించారు.