ప్రత్యేక హోదా పోరాటం:వైసిపి ఆ విధంగా ముందుకు పోనుందా?
గుంటూరు:ఎపికి ప్రత్యేక హోదా కోసం కేంద్రం పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఐదుగురు వైసిపి ఎంపీల్లో ఇప్పటికే ముగ్గురు ఆస్పత్రిలో చేరగా దీక్ష కొనసాగిస్తున్న మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో వారిద్దరినికి కూడా ఆస్పత్రికి తరలిస్తే ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం వైసిపి పోరాటం ఏమవుతుంది?...వారు కూడా టిడిపి ఎమ్మెల్యేల లాగే అక్కడ నుంచి తట్టా బుట్టా సర్ధుకొని ఎపిలో పోరాటం అంటూ తరలివస్తారా? లేక అక్కడే పోరాటం కొనసాగించేందుకు ఇంకేమైనా వ్యూహ రచన చేశారా? అనే ప్రశ్నలు తాజా పరిస్థితులను బట్టి ఉత్పన్నమవడం సహజం. అయితే ప్రత్యేక హోదాపై ఢిల్లీలో తమ పోరాటం కొనసాగించాలని, అందుకోసం వైసిపి అధినేత జగన్ ఇప్పటికే వ్యూహ రచన చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. మరైతే ఆ వ్యూహం ఇదేనా?...
అంతా ఆస్పత్రిలో చేరితే...ఆ తరువాత
ఎపికి ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష అయిదో రోజుకు చేరింది. ఈ పోరాటం చేస్తున్న ఐదుగురు ఎంపీల్లో ముగ్గురు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్ ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇప్పటికే వీరిని ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే దీక్ష కొనసాగిస్తున్న ఇద్దరు ఎంపీల ఆరోగ్య పరిస్థితి ఐదోరోజు దీక్ష సందర్భంగా ఆందోళనకరంగా మారినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. దీంతో వీరిద్దరిని కూడా ఆస్పత్రికి తరలిస్తే ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసిపి పోరాటం ఏమవుతుంది? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.
అయితే దీనికి కూడా...పక్కా ప్రణాళిక
అయితే ఈ పరిస్థితిని ఊహించిన జగన్ ఇందుకు ప్రత్యామ్నయంగా పక్కా ప్రణాళిక సిద్దం చేసే వుంచుకున్నారట. ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపిలు వివిధ రకాలుగా ఆందోళన చేసిన తరువాత వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆంధ్రాకు వచ్చేయడం ఆ పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ చేసినట్లు భావిస్తున్న జగన్ తమకు అలాంటి నష్టం వాటిల్లకూడదని ముందుగానే ప్లాన్ సిద్దం చేసుకున్నారట. ఆ ప్లాన్ ప్రకారం ప్రత్యేక హోదా కోసం టిడిపి కంటే తామే సిన్సియర్ గా కేంద్రంపై ఫైట్ చేస్తున్నట్లు మైలేజ్ తెచ్చుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.
ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే...ఇదేనా!
ముందుగా ఐదుగురు లోక్ సభ ఎంపీలతో ఆమరణ నిరాహార దీక్ష చేయించిన వైకాపా, ఈ ఎంపీలందరిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలిస్తే ఆ తరువాత వారి స్థానంలో రాజ్య సభ ఎంపీలతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుందట. ఆ విధంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యేక హోదా కోసం వైసిపి పోరాటం ఉధృతిని కొనసాగించాలనేది జగన్ వ్యూహమట. అయితే వారిద్దరి వయసు రీత్యా వారు నాలుగైదు రోజుల మించి ఆమరణ దీక్షలో కొనసాగే పరిస్థితి ఉండదు. దీంతో వీరు కూడా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైతే ఆ తరువాత పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఇప్పుడే తలెత్తడం సహజం. అయితే అందుకు కూడా జగన్ ముందే ప్లాన్ చేశారట.
ఆ తరువాత దీక్షలో...ఎమ్మెల్యేలు
అలా వైసిపి రాజ్య సభ ఎంపీల ఆమరణ దీక్ష కూడా భగ్నం అయితే ఆ తరువాత వైసిపి ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతారట. ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉంది కాబట్టి వారి ఆమరణ దీక్ష చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుందని, మరోవైపు ప్రత్యామ్నాయ పోరాటాల ద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చి ఏరో ఒక ప్రకటన చేయించడం ద్వారా వైసిపి నే ప్రత్యేక హోదా సాధనకు చిత్త శుద్దితో గట్టి పోరాటం చేసిందని ప్రజల దృష్టిలో విశ్వాసం సంపాదించేలా చేయవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వైకాపా నేతలకు జగన్మోహన రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మరైతే జగన్ వ్యూహం ఇదేనా...మరేదైనా ఉందా అనేది మరి కొన్నిరోజుల్లోనే తేలిపోనుంది.