అధ్యక్షా...సభ్యుల సంగతి తర్వాత..! ముందు మీరు మారాలంటున్న ఫాన్స్..!
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో సాధారణ నాయకుడిగా ఉన్నప్పుడు అవసరాన్నిబట్టి కాస్తంత దూకుడుగా ఉండాలి. స్థాయి పెరిగినప్పుడు హుందాగా వ్యవహరించాలి. వేశ భాషల్లో తగిన మార్పు రావాలి. పదవిలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏపి అసెంబ్లీలో కొత్తగా స్పీకర్ పదవి చేపట్టిన తమ్మినేనీ సీతారాం కి అతికినట్టు వర్తిస్తాయని చెప్పొచ్చు. ఏపీ కొత్త స్పీకర్ తమ్మినేనీ సీతారాం గారు కొత్త పదవిలో ఒదిగిపోయారా...? ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన, మూడుసార్లు మంత్రి పదవి అధిష్టించిన ఆయనకు రాజకీయ అనుభవం పుష్కలంగానే ఉంది. కాకపోతే, సీటు కొత్తది. పదవి కొంగొత్తది. ఏ రాజకీయ నేతయినా సరే, స్పీకర్ స్థానంలోకి మారిన తరువాత తాను మారాలి, తనను తాను పూర్తిగా మార్చుకోవాలి. అప్పటివరకూ అలవాటు లేని పాత్రను పోషించటం కాస్త కష్టమైన పని. అందుకే, కొంత హోమ్ వర్క్ చేయాలి.
అందులోనూ, తమ్మినేని వంటి వారికి మరింతగా కష్టపడాలి. ఎందుకంటే.. తమ్మినేని కాస్త దుందుడుకుగా, దూకుడుగా ఉంటారు. అలాంటి నేత.. స్పీకర్ కుర్చీలో కూర్చోవటం కాస్త కష్టమే. సభాపతిగా తొలి రోజును తడబడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కొన్ని సందర్భాల్లో సభను నియంత్రించేందుకు కష్టపడ్డారు. సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నంలో... 'ఏయ్..', 'అయ్..' అంటూ గదమాయించబోయారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ కోణంలో చూసినప్పుడు తమ్మినేని తనను తాను వీలైనంత త్వరగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సోషల్ మీడియాలో అభిప్రాపాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతోమంది స్పీకర్లను చూసిన ఆయన.. తనను తాను స్పీకర్ స్థానంలో ఊహించుకుంటూ ఆయన కాస్తంత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమోనన్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.