చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. పదేపదే టార్గెట్ చేస్తున్నారు.
జగన్ పైన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించి, రీకాల్ చేసేందుకు చంద్రబాబు ప్రధానికి లేఖ రాశాడట అని, కానీ కోర్టు ఆదేశాల మేరకే ఎన్ఐఏ విచారణ మొదలైందని, ఈ విషయంలో ప్రధాని ఏం చేయలేడని తెలిసినా మీడియాలో కనిపించాలనే కోరికతో చంద్రబాబు రాశాడని పేర్కొన్నారు.
'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
పాపం చిట్టినాయుడికి తెలియదు
తెలంగాణలో కేటీఆర్ పార్టీ (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నారా లోకేష్కు నిద్రపట్టడం లేదని, తండ్రి (చంద్రబాబు) వెంటనే తప్పుకొని సీఎం కుర్చీ గానీ, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుండునని కలలుగంటున్నాడని, కానీ చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని పాపం చిట్టినాయుడుకు (లోకేష్) తెలియదని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి కష్టాలు, బాబు ఐరన్ లెగ్ మహిమ
చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఆలింగనం (కలవడం) చేసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడికి కష్టాలు వస్తున్నాయని, యూపీలో అఖిలేష్, మాయావతిలు కాంగ్రెసు పార్టీని దూరం పెట్టారని పేర్కొన్నారు. ఇక యూపీఏ ఇంకెక్కడ అన్నారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్కు సంబంధం లేని ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట, ఇదీ బాబు ఐరన్ లెగ్గు మహిమ అన్నారు.
మిగిలింది 90 రోజులే
వరుస ఓటములతో ఎమ్మెల్సీ పదవులు సంపాదించుకున్న దుష్ట చతుష్టయం యనమల, సోమిరెడ్డి, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని చిట్టి నాయుడు, నారాయణలు దొడ్డిదారిన మంత్రులై రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని, .మిగిలింది 90 రోజులేనని, దుర్మార్గ పాలన ముగిసే సమయం ఆసన్నమైందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
నిప్పు మనిషికి వణుకు ఎందుకో
ఇంత దోపిడీ అంతర్యుద్దాలలో మునిగి తేలే ఆఫ్రికా దేశాల్లోనూ కనిపించదేమోనని, నేషనల్ హైవేస్ నిర్మాణానికి కి.మీ.కు రూ.18 కోట్లు ఖర్చు పెడుతుంటే చంద్రబాబు సారు అమరావతి రోడ్లకు కి.మీకు రూ.36 కోట్లు అప్పనంగా ముట్టచెప్తున్నారట అని, దేశం బడ్జెట్ మొత్తం కేటాయించిన అమరావతి పూర్తి కాదేమోనని ఎద్దేవా చేశారు. ఎన్ఐఏ పేరు వింటేనే చంద్రబాబుకు చలిజ్వరం వస్తోందని, అసలా సంస్థ దర్యాఫ్తే మొదలు పెట్టలేదని, కోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారన్నారు. మరోవైపు ప్రధాని మోడీకి లేఖ రాశారన్నారు. నిప్పు మనిషికి ఇంత వణుకు ఎందుకో అన్నారు.
నవరత్రాలు, పుత్రరత్నం
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి సైరాపంచ్ పేరుతో కార్టూన్లు కూడా సెటైరికల్ ఫోటోలు కూడా పెడుతున్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబు పింఛన్ రెండు వేలు ఇస్తానని చెప్పారని, జనవరిలో టెన్షన్ పెరిగింది, ఫిబ్రవరిలో పెన్షన్ పెరిగిందని ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం జగన్ నవరత్నాలు అంటుంటే, కొడుకు సంక్షేమం కోసం చంద్రబాబు పుత్రరత్నం అంటూ మరో ఫోటో పెట్టారు.