ఫలితాల తరువాత టీడీపీలో చీలిక తప్పదు..! ఆరోపణల పై విచారణ ఉంటుందన్న ఏపీ బీజేపి..!!
విజయవాడ/హైదరాబాద్ : ఏపీ లో తెలుగుదేశం పార్టీ దయనీయ స్థితిలోకి వెళ్లడంతో పాటు పార్టీలో చీలికలు ఖాయమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ఏపీ లో ఉనికి కోల్పోవడం ఖాయమని తెలిసే.. జాతీయ రాజకీయాల్లో ఉండాలనే చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండుగా చీలడం ఖాయం. ఒక వర్గం నారా వారి తరపున, మరో వర్గం ఎన్టీఆర్ కుటుంబం తరపున ఉంటారని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. ఏపీ లో అధికారం లోకి వచ్చే పార్టీ చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలపాలి. చంద్రబాబు బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఉందంటూ చేసిన అసత్య ప్రచారం వైసీపీకి లాభం చేకూర్చిందన్నారు. రాజకీయాలలో చంద్రబాబు వంటి దగాకోరు నేత ఎవరూ లేరు. చంద్రబాబు చేసిన అనేక ఆరోపణల పై మేము అధికారంలోకి వచ్చాక ప్రాసిక్యూషన్ చేస్తామన్నారు.
డేటా చోరీ అంశం చాలా తీవ్రమైందని, దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని, అనిల్చంద్ర పునీత తప్పుచేసి.. తప్పించేలా చేయడానికి కారణం ఎవరని మాధవ్ ప్రశ్నించారు. ఈవీఎం లు టాంపరింగ్ చేశారని చెప్పిన చంద్రబాబు, అవి ఎలా జరిగాయో కూడా చెప్పాలని, లగడపాటి సర్వే నిజమైతే.. చంద్రబాబే ఈవీఎం లు టాంపరింగ్ చేసినట్లు అంగీకరిస్తారా అని నిలదీసారు. వైసీపీ, బీజేపీ లు ఎక్కడైనా కలిసి ప్రయాణం చేశాయా.. దమ్ముంటే నిరూపించాలి. బీజేపి అనుకూల వర్గాలు కూడా వైసీపీకే ఓటేశాయి. మేము ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచి కేంద్రం లో అధికారం లోకి రావడం ఖాయం. జనసేన ఓట్లు చీలికతో గెలుస్తామనుకున్న చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టింది. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, బీజేపీ కి సంబంధం లేదు. పసుపు కుంకుమ పని చేసిందని చంద్రబాబు భావిస్తున్నారు.. అది నిజం కాదని 23 న తేలుతుందని మాధవ్ అన్నారు.