హైకోర్టు తీర్పులపై జగన్ సర్కార్ అంతర్మథనం- త్వరలో సుప్రీంకోర్టులో సవాల్- లీగల్ టీమ్ మార్పులు ?
ఏపీ హైకోర్టులో నిన్న ఒకే రోజు మూడు కీలక తీర్పులు వెలువడటం, అవి ప్రభుత్వానికి ఎదురుదెబ్బలుగా మారడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కీలకమైన అంశాలపై ప్రభుత్వ వ్యవహారశైలికి అద్దం పట్టేలా హైకోర్టు తీర్పులున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తుండగా.. సర్కార్ మాత్రం వీటిపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహరచన ఆరంభించింది.
జగన్ సర్కారుకు కోర్టుల కళ్లెం ఇందుకే.. ఎంపీ గల్లా అనూహ్య కామెంట్లు.. సీఎంకు కన్నా, ఉమ చురకలు..
హైకోర్టు తీర్పులపై అంతర్మథనం...
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరు, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వంటి మూడు కీలక అంశాల్లో ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తప్పలేదు. దీనిపై ప్రభుత్వంలో అంతర్మథనం కనిపిస్తోంది. తాజా తీర్పులపై ప్రభుత్వంలోని పెద్దలతో సీఎం జగన్ ఇవాళ ఉదయం సంప్రదింపులు మొదలుపెట్టారు. కీలక నేతలను పిలిపించుకుని హైకోర్టులో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే ఈ మూడు వ్యవహారాల్లోనూ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినప్పటికీ హైకోర్టులో ఎందుకు చుక్కెదురైందన్న అంశమే ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
సున్నిత అంశాలపై...
వైసీపీ రంగుల వ్యవహారాన్ని పక్కనబెడితే డాక్టర్ సుధాకర్, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. వైసీపీ రంగులది రాజకీయమే అనుకున్నా.. సుదాకర్ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని ఉత్తర్వులు ఇవ్వడం, అలాగే క్యాట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ఛార్జిషీట్ నమోదును సమర్ధించిన ఏబీ వెంకటేశ్వరావు కేసులో సస్పెన్షన్ ఎత్తివేత ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం తెచ్చే అవకాశముంది. దీంతో ఆయా అంశాలపై వెంటనే తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
సుప్రీంకోర్టులో సవాల్....
తాజాగా వెలువడిన మూడు తీర్పులపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడిన వ్యవహారాలు కావడం, వెంటనే స్పందించకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉండటంతో దీనిపై వెంటనే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆలస్యంగానైనా వ్యూహాత్మకంగా వ్యవహరించామని, కానీ ఈసారి వెంటనే స్పందించాల్సిన పరిస్ధితులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పులను సవాల్ చేసే అవకాశముంది.
Recommended Video
లీగల్ టీమ్ లోనూ మార్పులు ?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పలు అంశాల్లో హైకోర్టు నుంచి వరుసగా ప్రతికూల తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో లీగల్ టీమ్ లోనూ మార్పుల దిశగా జగన్ సర్కారు అడుగులు వేయొచ్చనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న కేసుతో ప్రారంభిస్తే, రాజధాని తరలింపు, రాజధానిలో పేదలకు భూములు, ఇంగ్లీష్ మీడియం, వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఇలా దాదాపు పది అంశాల్లో తాజాగా ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వెలువడ్డాయి. దీంతో సాధారణ ప్రజల్లో సైతం ప్రభుత్వ న్యాయ విభాగం సమర్దతపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లీగల్ టీమ్ లో మార్పులకు సీఎం జగన్ సిద్ధపడొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా త్వరలోనే మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.