జర భద్రం: గజ తుఫాను రూపంలో ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరువక ముందే మరో ప్రమాదం గజ తుఫాను రూపంలో ఉత్తరాంధ్రకు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోస్తాంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలో ఈ గజ తుఫాను ఉన్నట్లు అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు. నాగపట్టణం, చెన్నై తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 14న సాయంత్రానికల్లా తుఫాను బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తుఫాను తీరం దాటే సమయంలో గాలులు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నవంబర్ 13న తమిళనాడు, పుదుచ్చేరిలలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లరాదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని...గడిచిన ఆరుగంటల్లో ఇది తీవ్రరూపం దాల్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 24 గంటల్లో ఇది తుఫానుగా మారి పశ్చిమ- వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 36 గంటల్లో తమిళనాడు, 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ను తాకుతుందని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటికే అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కృష్ణ పట్నం పోర్టులో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.