రెండు నెలల తర్వాత భవిష్యత్ కార్యాచరణ: లక్ష్మీనారాయణ
శ్రీకాకుళం: రెండు మాసాల తర్వాత తన భవిష్యత్ కార్యాచారణను వెల్లడించనున్నట్టు మాజీ సీబీఐ జెడీ వి.వి లక్ష్మీనారాయణ చెప్పారు. లక్ష్మీనారాయణ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏపీ రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో రైతు సమావేశాలను గురువారం నాడు లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాల వారీగా రైతులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
రైతులు, ప్రజలతో చర్చించి రెండు మాసాల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తోందని విశ్వాసాన్ని లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు.
లక్ష్మీనారాయణ రెండు మాసాల తర్వాత ఏ రకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఏపీ రాష్ట్రంలో ఎన్నికలకు సుమారు ఏడాది సమయం ఉంది. ఈ తరుణంలో లక్ష్మీనారాయణ తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం లక్ష్మీనారాయణ రైతాంగ సమస్యలు తీసుకొని పనిచేస్తున్నారు. సామాజిక సమస్యలు తీసుకొని పనిచేస్తారా, రాజకీయాల్లోకి వస్తారా అనేది రెండు మాసాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.