ఉగాది తర్వాత రాష్ట్రానికి అరిష్టమా?...ఎందుకు?...ఎవరు చెప్పారు?...
విజయనగరం: ఎపికి దుర్థినాలు రాబోతున్నాయా?...వచ్చే ఉగాది తర్వాత రాష్ట్రానికి అరిష్టం ఏర్పడుతుందా?...అంటే అవునంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి...విజయనగరం జిల్లా చిలకాం పంచాయతీ దత్తి వలస గ్రామంలో రాజ్య సభ ఎంపీ జేడీ శీలం అభివృద్ధి నిధులతో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉగాది తర్వాత గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి అరిష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని...ఎపిలో పరిస్థితులు అధ్వనంగా మారనున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి జోస్యం చెప్పారు. మన గ్రామాల్లో ప్రజలకు విదేశీ మతాలను అంటగట్టేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, గ్రామీణులను బలవంతంగా ఇతర దేశాల మతాల్లోకి మార్చేందుకు విదేశీయులు ప్రయత్నిస్తున్నారని, వీటిని గ్రామస్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మన గ్రామాల్లో అమ్మవారి గుడి పక్కన రామాలయాలు నిర్మించడం ఎంతో మంచి పరిణామమని స్వరూపానందేద్ర సరస్వతి చెప్పారు. కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు ఆలయాన్ని పచ్చని పంట పొలాల మధ్య నిర్మించాలని నిర్ణయించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. పంట పొలాల మధ్య నూతనంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి ఢిల్లీ తెలుగు అకా డమి కార్యదర్శి డాక్టర్ ఎన్ఎల్వీ నాగరాజు రూ.మూడు లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించడం సంతోషమన్నారు. రామాయల నిర్మాణం పూర్తికి గ్రామస్థులందరూ ఏకమై సహకరించాలని కోరారు.
ఇక ఎపిలో రహదారుల అభివృద్ధి పేరిట విజయవాడ పరిసరాల్లో 45 దేవాలయాలను కూల్చడం హేయమైన చర్యని స్వరూపానందేద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించడం క్షమించరాని నేరమని స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు.