అసహనం, వెంకయ్య తర్వాత మరో షాక్: పవన్ కళ్యాణ్ను చాచికొట్టిన బిజెపి!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు బీజేపీ నేతల వ్యాఖ్యల పైన గత కొద్ది రోజులుగా ఆగ్రహంగా ఉన్నారు.
జనసేన అసంతృప్తి
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ-టిడిపిలకు అండగా ముందుకు వస్తే, ఇప్పుడు ఆయన పైనే రెచ్చిపోతున్నారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ కారణంగానే ఏపీలో టిడిపి-బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
రాజకీయ లబ్ధి కాదు
పవన్ కళ్యాణ్ సరైన సమస్య మీదనే నిలదీస్తున్నారు తప్ప, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ విమర్శలు గుప్పించడం లేదని అంటున్నారు. అలాంటి పవన్ పైన అధికార పార్టీ నేతల తీరు సరిగా లేదని అంటున్నారు. నిన్న వెంకయ్య, నేడు సిద్ధార్థనాథ్ వ్యాఖ్యలు సరికాదని చాలామంది అంటున్నారు.
మోడీతో కలిసి..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్.. టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. ఆయన కారణంగానే కాపు ఓట్లు అటు వైపు మొగ్గారనే వాదనలు ఉన్నాయి. మోడీ, పవన్, చంద్రబాబులు కలిసి ప్రచారం చేశారు. అంతేకాదు, హోదా పైన మోడీ కూడా హామీ ఇచ్చారు. దాని పైనే ఇప్పుడు పవన్ నిలదీస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
పార్లమెంటులోను..
2014లో బీజేపీ అద్భుత విజయం సాధించిన అనంతరం, మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్కు కూడా ఆహ్వానం అందింది. మోడీ తనను గుర్తుంచుకోవడంపై పవన్ కళ్యాణ్ కూడా నాడు స్పందించారని గుర్తు చేస్తున్నారు.
ఆ తర్వాతే ఎదురు తిరిగింది
ప్రత్యేక హోదా, ఇతర సమస్యల పైన పవన్ కళ్యాణ్ నిలదీయడం నుంచే అసలు సమస్య ప్రారంభమైందని చెప్పవచ్చు. అప్పటి దాకా పవన్ పైన బిజెపి విమర్శలు చేయలేదు. ప్రత్యేక హోదా పైన ఆయన కాకినాడ సభలో గట్టిగా మాట్లాడారు. దీంతో వెంకయ్య నుంచి పలువురు నేతల వరకు పవన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు కారణాలు చెప్పడం పైనే పవర్ స్టార్ ప్రశ్నిస్తున్నారనేది మరికొందరి వాదన.
వెంకయ్య నాయుడు కామెంట్లు
పవన్ తన కాకినాడ సభలో వెంకయ్య పైన సెటైర్లు వేశారు. అప్పటి నుంచి వెంకయ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా జనసేన అధినేత పైన విరుచుకుపడుతున్నారు. తాము పాచిపోయిన లడ్డూలు ఇవ్వలేదని, డబ్బులు పాచిపోలేదని, కొందరు మిత్రులు తమను విమర్శిస్తున్నారని.. పలు సందర్భాల్లో పవన్కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సిద్ధార్థనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము జనసేనతో జట్టు కట్టలేదని, నాటి ఎన్నికల్లో ఆయన బీజేపీ - టీడీపీకి మద్దతు మాత్రమే తెలిపారని చెప్పారు.