నేడే తొలి కేబినెట్: ఉద్యోగులకు ఐఆర్..సీపీఎస్ రద్దు: మంత్రులకు జగన్ దిశా నిర్ధేశం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి సమావేశం ఇది. ఈ సమావేశంలోనే జగన తన ఎన్నికల మేనిఫెస్టో అంశాలను అమలు చేసే విధంగా నిర్ణయాలు ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఏపీ ఉద్యోగులకు ..ఆర్టీకి కార్మికులకు వరాలు ప్రకటించనున్నారు. ఇక, ఇప్పటికే తీసుకున్న నిర్ణయలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది ఏపీ కేబినెట్.
జగన్ అధ్యక్షత తొలి కేబినెట్..
ఏపీలో వైసీపీ ప్రభత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ సహచరులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అదే విధంగా ఆవీనీతి రహిత పాలన..పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ పాలన ఏ రకంగా ఉండాలనేది దాని పైనా మంత్రులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. పార్టీ..ప్రభుత్వం రెండు కళ్లుగా పని చేయాలని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం..పదవులు రాని వారిని..పార్టీ నేతలను కలుపుకుపోవాలని సూచించనున్నారు. ప్రతీ మంత్రి మేనిఫెస్టోను తప్పని సరిగా అమలయ్యేలా చూడాలని..ప్రతీ రోజు సాధారణ ప్రజానీకం కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలని సీఎం మంత్రులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
కీలక అంశాలకు ఆమోదం..
జగన్ తన తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. తొలి సమావేశంలో 8 కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరగనుంది. పెన్షన్లు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మునిసిపల్ కార్మికుల జీతాల పెంపు... అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు, హోంగార్డుల జీతాల పెంపు.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై చర్చించనున్నారు. ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా..జగన్ తన మేనిఫెస్టో హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగులకు పెంచుతున్న 27 శాతం మధ్యంతర భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారనే దాని పైన కీలక ప్రకటన చేయనున్నారు. ఆర్టీసికి సంబంధించి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పైన నిపుణుల కమిటీ వేయటంతో పాటుగా నిర్ధేశిత గడువు ప్రకటన చేయనున్నారు.
సమయ పాలన..సామాన్య ప్రజలకు..
సామాన్య ప్రజలకు ప్రతీ మంత్రి అందుబాటులో ఉండాల్సిందేనని జగన్ స్పష్టం చేయనున్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది తప్పనిసరి చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు విధులు ప్రారంభించాలని.. ప్రభుత్వ ఉద్యోగులతో సాయంత్రం 5.30 గంటల తరువాత పని చేయించవద్దని జగన్ మంత్రులు స్పష్టం చేయనున్నారు. ఇక, ఖర్చులకు సంబంధించి జగన్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. మంత్రులంతా తమ శాఖల్లో ఖర్చు నియంత్రణ గురించి బాధ్యత తీసుకోవాలని జగన స్పష్టం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రులు అలంకార ప్రాయంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని..ప్రతీ ఒక్కరూ టార్గెట్ 2024 తో పని చేయాలని జగన్ తన మంత్రి వర్గ సహచరులకు సూచించనున్నారు.