నెట్లో చూశాక బికినీ అంటే తెలిసింది, ఆ పెట్టుబడులొద్దు: బాబుపై బీజేపీ మండిపాటు
అమరావతి: విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివెల్ 2017 నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడంపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం నిప్పులు చెరిగారు. అంతే కాదు, ఆయన బికినీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బికిన అంటే తాను స్కర్ట్ అనుకున్నానని, నెట్లో చూసిన తర్వాత అసలు విషయం అర్థమైందన్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రభుత్వం సన్నహాలు చేస్తుండటంపై మండిపడ్డారు.
ఇలాంటి ఫెస్టివెల్స్ నిర్వహించడం సరికాదన్నారు. ఇవి మన సంప్రదాయం, సంస్కృతి కావన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసమంటూ ఇలాంటి ఫెస్ట్ నిర్వహించాలనుకోవడం విడ్డూరమన్నారు. మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు మనకు అవసరం లేదన్నారు.
వైసిపి కూడా దీనిపై మండిపడింది. ప్రేమికుల దినోత్సవం నాడు విశాఖపట్నం సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలని యోచిస్తుండటం సిగ్గుచేటు అని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి అంతకుముందు అన్నారు. తెలుగువారి మది నిండా ప్రేమ ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆర్భాటాలు అవసరం లేదన్నారు.
కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. గోవా తరహాలో విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం సరికాదని అన్నారు.
కాగా, ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు బీఎల్ఎఫ్ 2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. దీనిపై వైసిపి, బీజేపీ తదితర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఫెస్టివల్లో ప్రముఖ పాప్ స్టార్ షకీరా తన అందాలతో కను విందు చేయబోతోందని చెబుతున్నారు. విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. షకీరా మూడు రోజుల పాటు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉంది.
ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ ఈ ఫెస్టివల్ను నిర్వహించబోతోంది. ఈ ఉత్సవాన్ని ఆనందోల్లాసాల మధ్య నిర్వహించేందుకు అవసరమైన పది ఎకరాల భూమిని సేకరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలను, సాగరనగర్ను, తోట్లను సందర్శించారు.