అసంపూర్తిగానే ముగిసిన ఆర్టీసీ చర్చలు... కుదరని ఏకాభిప్రాయం...
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్దరణం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావట్లేదు. మంగళవారం(సెప్టెంబర్ 15) ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన సమావేశం కూడా ఏ విషయం తేలకుండానే ముగిసింది. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్... లేదు, రూట్ల వారీగా బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరువురు పరస్పరం విబేధించుకోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
సమావేశం అనంతరం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ... దేశంలో కిలోమీటర్ల ప్రాతిపదకనే అంతరాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ఏపీ బస్సులు 71 రూట్లలో నడుస్తున్నాయని.. ఏపీలో తెలంగాణ బస్సులు 28 రూట్లలో మాత్రమే నడుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన రూట్ల వారీ సర్వీసులపై ఆలోచిస్తామన్నారు. రెండు రోజుల తర్వాత మరోసారి ఈడీల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామన్నారు.
ఆలోపు ప్రస్తుత డిమాండ్ రీత్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 250 బస్సులు నడుపుదామని ప్రతిపాదించినట్లు చెప్పారు. దీనిపై తెలంగాణ అధికారులు ఆలోచించుకుని నిర్ణయం చెబుతామన్నారని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అనవసరంగా ప్రైవేట్ ట్రావెల్స్ లాభపడుతాయని అన్నారు.
తెలంగాణ టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ... రూట్ల వారీగా బస్సులు నడపాలని ఏపీ అధికారులకు ప్రతిపాదించామన్నారు. తమ ప్రతిపాదనపై ఆలోచించి చెబుతామన్నారని తెలిపారు. రూట్ల వారీగా బస్సులు నడిపితేనే ఇరు రాష్ట్రాలకు లాభం చేకూరతుందని తెలిపారు. తమ ప్రతిపాదనకు ఓకె చెప్తే ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతామన్నారు. కిలో మీటర్ల ప్రాతిపదికన బస్సులు నడిపితే నష్టం వస్తోందన్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య చెరో 250 బస్సులను నడిపే అంశంపై కూడా ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు.