మళ్లీ ‘కాల్మనీ’ కలకలం! కమిషనర్ కు ఫిర్యాదుతో దారుణాలు వెలుగులోకి...
కాల్ నాగినులు మళ్లీ విజయవాడ శివార్లలో బుసకొడుతున్నాయి. వీరి బారిన పడిన బాధితులు మళ్లీ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
విజయవాడ: కాల్ నాగినులు మళ్లీ విజయవాడ శివార్లలో బుసకొడుతున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కాల్మనీ నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆ సమయంలో కంటికి కనిపించకుండా పోయిన శివారు ప్రాంత కాల్మనీ కిలాడీలు మళ్లీ తెరపైకి వచ్చారు.
వీరి బారిన పడిన బాధితులు మళ్లీ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఓ బాధితురాలు నాలుగు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించినా న్యాయం పొందలేక పోయింది. తాజాగా మరో బాధితుడు శుక్రవారం సీపీ గౌతమ్ సవాంగ్ను ఆశ్రయించాడు.
ఓ ‘కాల్నాగిని' దారుణాలు...
నగర శివార్లలోని శాంతినగర్ కేంద్రంగా రూ.కోట్లలో ప్రైవేట్ చీటి పాటలు నిర్వహిస్తున్న ఓ మహిళ అవసరాలకు అప్పులిచ్చి, వడ్డీలపై వడ్డీలు వేసి పేదలను జలగలా పీల్చేస్తోంది. ఆనక వారి ఇళ్లను స్వాధీనం చేసుకుని నిలువ నీడలేకుండా చేస్తుంది. రెండేళ్ల క్రితం కాల్మనీ నిర్వాహకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినపుడు కనిపించకుండా పోయిన ఈమె ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమయింది.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు...
ఈ కాల్నాగిని బారిన పడిన ఓ బాధితురాలు నాలుగు నెలల క్రితమే అజిత్సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. తాజాగా శుక్రవారం మరో కుటుంబం కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
నూటికి ఆరు రూపాయిల వడ్డీ...
ప్రకాష్నగర్లో నివసించే అడపా అంజిబాబు పెనాలు, పొయ్యిలు తయారు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అన్న కుమార్తె వివాహం కోసం నాలుగేళ్ల క్రితం శాంతినగర్ ప్రాంతానికి చెందిన మహిళ వద్ద రూ. 4లక్షలు వడ్డీకి తీసుకున్నారు. నూటికి ఆరు రూపాయిలు వడ్డీ వంతున రెండేళ్ల క్రితం రూ.2 లక్షలు తిరిగి ఇచ్చేశాడు. అనంతరం పనులు సరిగా లేక వడ్డీ డబ్బులు చెల్లించలేకపోయాడు.
ఇల్లు కొట్టేయడానికి ప్లాన్...
గత నెలలో వడ్డీ డబ్బు కోసం అంజిబాబు వద్దకు వెళ్లిన సదరు కాల్నాగిని తన కుమార్తె వివాహానికి డబ్బు అవసరమని, అంజిబాబు ఇంటి కాగితాలు ఇస్తే.. వాటిని జీపీఏ చేయించి, అప్పు తీసుకోవడంతో పాటు అతనికి కూడా రూ.లక్ష ఇప్పిస్తానని సంతకం చేయమని కొన్ని పత్రాలిచ్చింది. అయితే ఆమె ఇచ్చిన ఆ పత్రాల్లో తన ఇంటిని ఏకంగా విక్రయిస్తున్నట్లు ఉండడంతో దీనికి అంజిబాబు ససేమిరా అన్నాడు. అంతే- ఆ రోజు నుంచి ఆమె వేధింపులు మొదలయ్యాయి.
పోలీసులకు ఫిర్యాదు చేసినా...
ఈ మేరకు అంజిబాబు పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ కాల్నాగిని బారిన పడిన ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ తన ఇంటిని వదిలి, సింగ్నగర్లో తలదాచుకుంటోంది. ఆమె నాలుగు నెలల క్రితం సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం పొందలేకపోయింది.
రూ.10 వేలు.. వారానికి 1500 వడ్డీ...
వాంబే కాలనీ కేంద్రంగా ముగ్గురు స్థానికులు, కృష్ణలంక ప్రాంతానికి చెందిన మరో కిలాడి కాల్మనీని మించిపోయే రీతిలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వీరికి చెక్కులు, ప్రామిసరీ నోట్లతో పని లేదు. రూ.10 వేలు ఇస్తారు.. వారం తిరక్కముందే గుమ్మంలో వాలిపోతారు. వడ్డీ ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తారు. పోలీస్ కేసు పెడితే ఇక తమను తమ ఇళ్లల్లో ఉండనివ్వరని స్థానికులు భయపడుతున్నారంటే ఈ వడ్డీ వ్యాపారులు ఏ స్థాయిలో పలుకుబడిని ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘మహిళా మిత్ర' రావాలి...
శివారు ప్రాంతాల్లో జరుగుతున్న చీట్టీ పాటలు, కాల్మనీ దందాపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నందున మహిళా మిత్ర బృందాలను రంగంలోకి దింపి ఈ కాల్నాగుల భరతం పట్టేందుకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలసిన పలువురు కోరుతున్నారు. వాంబే కాలననీ బి-బ్లాక్ కేంద్రంగా చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు ఈ కాల్మనీ బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాల్నాగుల దాష్టీకాన్ని తట్టుకోలేక ఒకరిద్దరు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.