మళ్లీ ఎన్కౌంటర్: ఇద్దరు మావోల మృతి, స్వగ్రామానికి ఆర్కే కొడుకు మృతదేహం
మల్కాన్గిరి/విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ అటవీప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సోమ, మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నాయకులతో సహా 28 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఘటనతో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరింది.
కాగా, ఏవోబీలో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా పోలీసు బలగాల మల్కాన్గిరి ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. నాలుగు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ డీజీపీ, ఒడిశా పోలీసులు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సొంత గ్రామానికి ఆర్కే కుమారుడి మృతదేహం
సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాన్ని అతని సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం అల్లాపూర్కు తరలించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడికి భారీ ప్రజలు చేరుకున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం మున్నా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.