ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 'కేఏ పాల్' ఏమన్నారో విన్నారా?, అమెరికా ఎన్నికలపై జోస్యం
విజయవాడ : సీరియస్ పాలిటిక్స్ లో.. సిల్లీ ఎంట్రీలా మిగిలిపోయింది ప్రముఖ క్రైస్తవ మతగురువు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ. అసలా పార్టీ ఒకటుందన్న విషయం జనంతో పాటు ఆయన కూడా మరిచిపోయి చాలా కాలమే అయిందనిపిస్తోంది. మరి చాలా గ్యాప్ వచ్చిందనుకున్నారో.. ఏమో.. మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లోకి ఎక్కారు కేఏ పాల్.
'ప్రపంచ యుద్దాలను ఆపాను, కష్టార్జితంతో ఏపీని ఆదుకున్నాను..' అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్ జనంలో ఆయన ఇమేజీని చులకన చేశాయి. కూరల్లో కరివేపాకును తీసేసినట్లు.. ప్రధాని స్రవంతి మీడియా ఆయన చేసే వ్యాఖ్యలను వార్తలకు దూరం పెట్టేసింది. దీనికి తోడు సోదరుడి హత్య కేసు కూడా వెంటాడడంతో.. కేఏ పాల్ ఇమేజీకి మరింత దెబ్బ పడింది.
ఇదంతా పక్కనబెడితే, ఎప్పుడు మాట్లాడారో.. ఎక్కడ మాట్లాడారో తెలియదు గానీ.. మరోసారి కేఏ పాల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాలోకి ఎక్కాయి. తాజాగా అమెరికన్ ఎన్నికల మీద కేఏ పాల్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. హిల్లరీ ఓటు వేయవద్దంటూ ట్రంప్ కు అనుకూలంగా కేఏ పాల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులకు హిల్లరీయే కారణమని, కాబట్టి అమెరికన్లంతా ఆమెకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.
అంతేకాదు, నవంబర్ 8న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దే విజయమని జోస్యం కూడా చెప్పారు పాల్. ట్రంప్ కు ఓటేయడం ఇష్టం లేనివాళ్లు ఇంట్లో కూర్చోవాలని అంతేగానీ హిల్లరీకి ఓటేయవద్దని సూచించారు. ఇక పనిలో పనిగా ప్రపంచ రాజకీయాలను గతంలో తానే శాసించినట్లుగా మరో కామెంట్ చేశారు. మరి కేఏ పాల్ తాజా వ్యాఖ్యలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో!