మళ్ళీ కృష్ణానది కరకట్టపై కూల్చివేతలు .. ఈసారి శివ క్షేత్ర నిర్మాణాల తొలగింపు
ఏపీ ప్రభుత్వం కృష్ణానది కరకట్ట మీద అక్రమ కట్టడాలు మాత్రం వదిలేలా లేదు. ఇప్పటికే పలుమార్లు అక్రమకట్టడాల నిర్మాణాలను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ అధికారులు మళ్లీ అక్రమకట్టడాల కూల్చివేత ను మొదలు పెట్టారు. కృష్ణానది కరకట్ట మీద ఉన్న శివ క్షేత్ర ఆశ్రమాన్ని కూల్చవద్దని, శివ స్వామి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా అక్రమ కట్టడాల కూల్చివేతను సీఆర్డీఏ అధికారులు మళ్లీ మొదలు పెట్టారు.
కృష్ణా నది తీరం వెంబడి ఉన్న పలు కట్టడాలు అక్రమ నిర్మాణాలని నిర్ధారించిన సి ఆర్ డి ఎ అధికారులు తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలోని శివక్షేత్రం వద్ద మరుగుదొడ్లు, క్యాంటిన్ భవనాలను కూల్చి వేస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల సహకారంతో సీఆర్డీఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఈ కారణంగా శివక్షేత్రం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
కృష్ణానది కరకట్ట పై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న నేపద్యంలో వారి వాదనలు సైతం విన్నారు. శివ క్షేత్రం ధార్మిక కార్యక్రమాల కోసం నిర్వహిస్తున్న క్షేత్రమని,దాని కూల్చివేత తగదని శివస్వామి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ సి ఆర్ డి ఏ అధికారులు మాత్రం నేడు శివ క్షేత్రం వద్ద ఉన్న 2 అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించాలని , లేదంటే తామే కూల్చి వేస్తామని మరో మారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆగాయి అనుకున్న కూల్చివేతలు మళ్ళీ మొదలు కావటంతో కరకట్ట మీద నిర్మాణాలు చేసినవారు ఆందోళన చెందుతున్నారు.