రమణ దీక్షితులు బాంబు: ఆ పని చేయకపోతే వినాశనం తప్పదు: టీటీడీపై ఇంకా చంద్రబాబు పెత్తనం
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో కరోనా తాకిడి ఉధృతమైంది. ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం కరోనా వైరస్ బారిన పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బందికి వైరస్ సోకింది. వారంతా క్వారంటైన్లలో ఉంటున్నారు. తాజాగా శ్రీవారి ఆలయంలో పనిచేసే ఎనిమిది అర్చకుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని ఐసొలేషన్కు తరలించారు. చికిత్స పొందుతున్నారు.
Recommended Video
టీటీడీపై కరోనా పంజా..
ఇలాంటి పరిస్థితుల్లోనూ తిరుమలలో శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్, ఇదివరకే జారీ చేసిన కోటా టికెట్ల ప్రకారం శ్రీవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి దర్శనాలను యధాతథంగా కొనసాగిస్తున్నారు టీటీడీ అధికారులు. ఫలితంగా అర్చకులు కరోనా బారిన పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
15 మంది అర్చకులకు కరోనా..
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాన్ని కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదని టీటీడీ ఆగమ సలహాదారు ఏవీ రమణ దీక్షితులు చెప్పారు. స్వామివారి దర్శనాన్ని కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో సేవలందించే 50 అర్చకులకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని రమణ దీక్షితులు చెప్పారు.
డిజాస్టర్లను చవి చూడాల్సి రావచ్చు..
మరో 25 మందికి సంబంధించిన కరోనా పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాలను కొనసాగించడం సరికాదని, కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని తాము టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, సహాయ కార్యనిర్వహణాధికారి భార్గవిని కోరామని, వారు ఇందుకు అంగీకరించట్లదని రమణ దీక్షితులు తెలిపారు. స్వామివారి దర్శనాలను కొనసాగించాల్సి పరిస్థితే వస్తే.. డిజాస్టర్లను చవి చూడాల్సి వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలపై ఇంకా టీడీపీ, చంద్రబాబు పెత్తనమే.
ఇప్పటికీ తిరుమలలో బ్రాహ్మణ, ఆలయ వంశపారంపర్య అర్చక వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు విధానాలే ఉన్నాయని, టీటీడీపీ వారి పెత్తనం ఇంకా ఉందని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన వైఎస్ జగన్ను కోరారు. స్వామివారి దర్శనాలు కొద్దిరోజుల పాటు నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు.
అంతకుముందు టీటీడీ అధికారులతో వైవీ భేటీ..
అంతకుముందు- టీటీడీ అధికారులతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ సోకిన విషయంపై చర్చించారు. కరోనా కొనసాగుతున్నప్పటికీ.. స్వామివారి సేవలను యధాతథంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయలనే విషయంపై చర్చించామని, దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసకోలేదని అన్నారు. ప్రభుత్వానికి కొన్ని నివేదికలను అందించామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద స్వామివారి దర్శనాలను కొనసాగించాలా? వద్దా? అనేది ఆధాపడి ఉంటుందని అన్నారు.